కొత్త చొరవల పదును లేని కేంద్ర బడ్జెట్‌

             కొత్త చొరవల పదును లేని కేంద్ర బడ్జెట్‌

                                                                                                                     - డి.వి.వి,యస్‌. వర్మ    
                                                                                                                  dvvsvarmablogspot.com
 
కేంద్ర బడ్జెట్‌ మీద ఈసారి దేశంలో కొంత ఆతృత కనిపించింది. 1991లో సరళీకరణ ప్రారంభం అయిన తరవాత రాను రాను బడ్జెట్ల మీద ప్రజల్లో ఆసక్తి తగ్గుతూ వచ్చింది. మొదటిది అంతవరకు ప్రతి బడ్జెట్‌లోనూ ప్రతి వస్తువుమీదా ఎంతోకొంత వడ్డింపులు వుండేవి. ఒకటి అరా రాయితీలు వుండేవి. బడ్జెట్‌ బయట వడ్డింపులు తక్కువగా వుండేవి. ఓటు బ్యాంకు ప్రజాకర్ష పధకాలు తక్కువగానే వుండేవి. ఇప్పుడు బడ్జెట్‌లో పన్నుల పెంపకాలు దాదాపు లేకుండా పోయాయి. వాట్‌తో దాని పని అది చేసుకుపోతున్నది. ఇక జి.యస్‌.టి వస్తే ప్రభుత్వాల పని మరీ తేలికవుతుంది.- ఇక రెండోది ప్రభుత్వ నియంత్రణలో వున్న వాటి ధరలను బడ్జెట్‌ వెలుపల పెంపుదల వుండేది. ఇప్పుడు గ్యాస్‌, ఆయిల్‌, ఫెర్టిలైజర్లు, ఇనుము, సిమ్మెంటు ఒక్కొక్కటి స్వేచ్ఛా మార్కెట్‌లోకి వచ్చేశాయి.  అందువల్ల బడ్జెట్‌ అంటే కేవలం ఆదాయపు రాయితీలకు ఎదురుచూడడం తప్ప అంతా షరా మామూలే కావడంతో ప్రజల్లో ఆసక్తి తగ్గింది.  వ్యాపార-వాణిజ్యవర్గాలు కూడా కొన్ని విధానపరమైన అంశాలకోసం ఎదురుచూడడం తప్ప ఆతృత వుండకుండా పోయింది. ఇదంతా మంచి పరిణామమే.

2013-14 బడ్జెట్‌కు వున్న నేపథ్యం వల్ల దీనిమీద చాలామంది ఆసక్తి చూపించారు. ఒకటి ఆర్థికాభివృద్ధి వేగం మందగించటం, ద్రవ్యోల్బణం ఎంతకీ దిగి రాకపోవడం, ప్రభుత్వం ఎన్నికల ముందు సంవత్సరంలోనే గ్యాస్‌, ఆయిల్‌ ధరలు మార్కెట్‌ ధరలకు దాదాపు దగ్గర చెయ్యడం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం, సబ్సిడీలను క్రమబద్ధం చెయ్యడానికి నగదు బదిలీని ప్రారంభించడంలాంటి చర్యలు తీసుకోవడంతో ఈ బడ్జెట్‌లో అదే దూకుడు వుంటుందని చాలామంది భావించారు. మందగించిన ఆర్థికాభివృద్ధిని తిరిగి పరుగులు తీయించడానికి కీలకరంగాలలో చర్యలు ఉంటాయని భావించారు. రెండోది ఎన్నికలకు  ముందు వున్న బడ్జెట్‌ గనుక జనాకర్షణ పధకాల వెల్లువ వుంటుందని ఊహించారు. ఈ పూర్వరంగంలో బడ్జెట్‌ విశ్లేషణ చేసుకోవడం అవసరం.

2013-14 సంవత్సరానికి 16,65,297 కోట్ల బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ద్రవ్యలోటును 5.2 గానూ, సంవత్సరాంతానికి ద్రవ్యలోటు 4.8 కానున్నట్లు ప్రకటించారు. ముందుగా ద్రవ్యలోటును  అదుపులో వుంచడంలో ఆర్థికమంత్రి కృతకృత్యులయ్యారనే చెప్పాలి. గ్యాస్‌, ఆయిల్‌, నగదు బదిలీలపై తీసుకున్న చర్యలు ఆర్థికమంత్రికి ఈ వెసులుబాటును కల్పించాయనే చెప్పాలి. కేవలం ద్రవ్యలోటు అదుపులో వున్నంత మాత్రాన పరిస్థితి సజావుగా వుందని ఎవరూ భావించకూడదు. మరొకపక్క ద్రవ్యోల్బణం ఇంకా వేధిస్తున్న సమస్యగానే వుండిపోయిందని గుర్తుంచుకోవాలి. 

ఇది ఎన్నికల బడ్జెట్‌

 

ఈ బడ్జెట్‌లో ఎన్నికల దృష్టి స్పష్టంగా కనిపిస్తున్నది. ఆర్థిక మంత్రి చిదంబరం మూడు తరగతులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు     తన ప్రసంగంలోనే ప్రకటించారు. వారికి వాగ్దానాలను ఇచ్చారు.  దేశప్రజలలో మెజారిటీగా వున్న మహిళలు, యువత, పేదలను ఆకర్షించడానికి ఈ బడ్జెట్‌ను ఎక్కు పెట్టారు.  ఇటీవల ఢిల్లీలో జరిగిన అమానుష మానభంగం ఘటన నేపథ్యంలో మహిళల రక్షణకు, సాధికారతకు ''నిర్భయనిధి'' పేరుతో 1000 కోట్లు ప్రకటించారు. అలాగే మహిళలకు ప్రత్యేక బ్యాంకును ప్రతిపాదించారు. ఇది స్వయంసహాయ సంఘ మహిళల అవసరాలను, మహిళా వ్యాపార వాణిజ్యవేత్తల అవసరాలను తీరుస్తుందని ప్రకటించారు.  అలాగే మహిళా శిశు సంక్షేమానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలకు 97,134 కోట్లు కేటాయింపులు చేశారు.

యువతకు నైపుణ్యాల అభివృద్ధికి నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను గతంలోనే ఏర్పాటు చేశారు. 10,00,000 మంది యువతకు ప్రత్యేక శిక్షణ పొందేలా వారిని ప్రోత్సహిస్తామని ఇందులో నైపుణ్యాల ప్రత్యేక పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్‌తోపాటు 10,000 రూపాయలు నజరానాను ప్రకటించారు. ఉద్యోగార్హమైన నైపుణ్యాలను పొందడానికి ఇది ప్రోత్సాహకారి అవుతుందని అన్నారు.

పేద ప్రజల కోసం ప్రారంభించిన నగదు బదిలీ పధకం ''మీ సొమ్ము మీ చేతికి'' అన్న నినాదంతో విస్తరించబోతున్నట్లు వెల్లడించారు. అలాగే అసంఘటిత రంగంలో వున్న రిక్షాడ్రైవర్లు, ఆటోడ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు వంటి వారికి బీమా పథకాన్ని  వర్తింపచేశారు.

మొత్తంమీద రాబోయే ఎన్నికల్లో మహిళల్ని, యువతని, పేదలనీ ఆకర్షించడానికి ఈ బడ్జెట్‌ను చిదంబరం సాధనంగా వినియోగించారు.

ఆర్థికాభివృద్ధికి అరకొర చర్యలు


ఆర్థికాభివృద్ధి రేటు ఒకనాడు 9 శాతానికి చేరింది. ఇప్పుడు 5.4 శాతానికి పడిపోయింది. దీనిని 8 శాతానికి పెంచడం లక్ష్యంగా ఒక సవాలుగా ఆర్థిక మంత్రి వర్ణించారు. కాని  దీనికి తీసుకున్న చర్యలు అంతంతమాత్రంగానే వున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో కొంతమేర రోడ్లకు సంబంధించిన కేటాయింపులు తప్పిస్తే కొత్త చొరవలు అంతగా లేవు. చిన్న పరిశ్రమలకు కొన్ని  రాయితీలు ప్రకటించారు. రెండు పోర్టులను ఏర్పాటు, రెండు మూడు పారిశ్రామిక కారిడార్లు పని ప్రారంభం వంటి కొన్ని చర్యలున్నాయి.

కీలకమైన విద్యుత్‌, బొగ్గు కొరతల సమస్యల్ని పరిష్కరించకపోతే ఈ 5 శాతం వృద్ధిరేటు కూడా నిలబడే అవకాశం లేదు. విద్యుత్‌ కొరత మన ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది.  రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీల సంస్కరణల ప్రస్తావన తప్ప విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చే విధంగా గ్యాస్‌, బొగ్గు అందించే ఏర్పాటుకు తక్షణ చొరవలు  ఈ బడ్జెట్‌లో లేవు. మనదేశంలో విస్తరమైన బొగ్గు నిక్షేపాలున్నా, తవ్వి తీసుకోడానికి తగిన పారదర్శకమైన ఏర్పాట్లు చెయ్యడంలో ప్రభుత్వం ఇప్పటికే విఫలం  అయింది. ఆయిల్‌ దిగుమతులతోపాటు విదేశీమారక ద్రవ్యాన్ని కొల్లగొట్టేదిగా బొగ్గు కూడా తయారైంది. బొగ్గు, గ్యాస్‌ పై విధాన నిర్ణయాలకు వేచి వుంటేది గానే బడ్జెట్‌ ప్రసంగం సాగింది. 

వ్యవసాయరంగానికి 27,049 కోట్లు కేటాయించినా, కీలకమైన వ్యవసాయ మార్కెట్ల విస్తరణకి, స్టోరేజీ సౌకర్యాలకు అదనపు విలువ సమకూర్చే స్థానిక పరిశ్రమలకు, దళారీవ్యవస్థ రద్దుకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. గ్రామ పంచాయతీలలో గోడౌన్‌ల నిర్మాణానికే పరిమితం చేశారు. పామాయిల్‌ దిగుమతి సుంకాలపై రైతు వ్యతిరేక విధానాలను సవరించలేదు. కేవలం బడ్జెట్‌కి సంబంధంలేని బ్యాంక్‌ రుణాలను 5 లక్షల కోట్ల నుండి 7 లక్షల కోట్లకు పెంచారు.

ఇక విద్యారంగానికి కేటాయింపులు పెంచారు. మానవ వనరుల అభివృద్ధి శాఖకు 86,000 కోట్లు కేటాయించారు. కాని విద్యాప్రమాణాల మీద ఎలాంటి దృష్టి పెట్టలేదు. హైస్కూలు విద్యమీద, పాఠశాల విద్య మీద అంతర్జాతీయ, జాతీయ సర్వేల నివేదికలు దయనీయమైన స్థితిలో వున్నా విద్యాస్థాయిని ప్రతి ఏటా  వెల్లడిస్తున్నాయి. అయినా మంచి ప్రమాణాల బోధన, దానికి తగ్గ పరీక్షలు, పాఠశాలల అజమాయిషీ, విద్యా హక్కు చట్టం అమలుకు చర్యలు వంటి అంశాలు విస్మరణకు గురయ్యాయి. అందరికీ విద్య అంటేనే సరిపోదు. అందరికీ  మంచి ప్రమాణాల విద్య, డబ్బుతో,  పుట్టుకతో నిమిత్తం లేకుండా అందించే ఏర్పాట్లు జరగకపోతే సమీకృత అభివృద్ధి అన్న మిధ్యే అవుతుంది. పేదరిక నిర్మూలనకు  వేలకొట్లు ఖర్చు చేస్తున్నా, స్వతంత్ర జీవనానికి, ఎదిగే అవకాశాలకు వీలు కలిగించే విద్యాహక్కు అందించకపోతే పేదరికం శాశ్వతం అవుతుంది. ఎదిగే అవకాశం మృగ్యం అవుతుంది.

అందరికీ ఆరోగ్యం పేరుతో జాతీయ ఆరోగ్యమిషన్‌ కార్యకలాపాలను పట్టణాలకు కూడా విస్త్తరింపచేశారు. ఈసారి వైద్య - ఆరోగ్య రంగాలకు కొంత కేటాయింపులు పెంచారు. ఇక్కడా అదే సమస్య. మంచి ప్రమాణాల వైద్యసేవలు ప్రజలకు అందడం లేదు.  దీనికి ఈ బడ్జెట్‌లో కూడా ఎలాంటి ప్రాధాన్యతా లభించలేదు.

 గ్రామీణాభివృద్ధికి కార్యకలాపాలకు 80,194 కోట్లు కేటాయింపులు చేశారు.  ప్రజలు నివసించే చోట వారికి శుద్ధి చేసిన మంచినీరు ఈగలు, దోమలు లేని పారిశుద్ధ్యం, రోడ్లు, గృహవసతి కల్పనకు వీటిని ఉద్దేశించారు. కాని పంచాయితీలకు, మున్సిపాలిటీలకు అధికారాలు, సిబ్బంది బదిలీ కాకుండా నేరుగా వాటికి నిధులు కేటాయింపులు జరపకుండా ఢిల్లీలో వేస్తే సడక్‌యోజనలు, ఆవాసయోజనలు, శానిటేషన్‌ పధకాలు ఆశించిన ఫలితాలనివ్వవు.

మొత్తంమీద ఈ బడ్జెట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రయత్నంగా కనిపిస్తున్నది. ఆర్థికాభివృద్ధి గురించి కొన్ని ప్రస్తావనలున్నా ఆర్థిక సంస్కరణలు సాహసోపేతమైన నిర్ణయాలకు ఈ బడ్జెట్‌ దూరంగా వుంది. విధానాల ప్రస్తావనే గాని ఆచరణ పదును లేని బడ్జెట్‌గా వుంది.

    మంచి ప్రమాణాల విద్య, ఆరోగ్యసేవలకు ఈ బడ్జెట్‌ భరోసా ఇవ్వలేకపోయింది. ప్రజలు జీవించే చోట్ల మౌలిక వసతుల కల్పనకు భరోసా ఇవ్వలేకపోయింది. విద్యుత్‌, బొగ్గు రంగాల సంక్షోభాల పరిష్కారానికి  దారి చూపలేకపోయింది. ఈ బడ్జెట్‌ గతాన్ని నెమరువేసుకున్నదీ కాదు, వర్తమానాన్ని అర్థం చేసుకున్నదీకాదు. అందుకే భవిష్యత్తు అవసరాలకు తగిన చొరవలు చూపలేకపోయింది.



                                                    ***


ఆర్ధిక స్వేచ్ఛలో దిగజారిన భారత్‌ స్థానం

              ఆర్ధిక స్వేచ్ఛలో  దిగజారిన భారత్‌ స్థానం 

                                                                                                             - డి.వి.వి.యస్‌. వర్మ
                                                                                                            dvvsvarmablogspot.com          


ప్రపంచ దేశాలలో ఆర్ధిక స్వేచ్ఛ 2012 వార్షిక నివేదిక 2013 జనవరిలో విడుదలైంది. ప్రతి ఏటా హెరిటేజ్‌ ఫౌండేషన్‌ ఈ నివేదికను రూపొందిస్తున్నది. 177 దేశాల పట్టికలో మనది 119వ స్థానం - సాధించిన ర్యాంకు 111. మనదేశం ఈ ర్యాంకులలో అజర్‌బైజాన్‌, బంగ్లాదేశ్‌, ఇరాన్‌, మాలి, నైజీరియా, పాకిస్తాన్‌, సియర్రా లియోన్‌, సిరియా, టాంజానియాల గుంపులో వుంది. బంగ్లాదేశ్‌ 109, నేపాల్‌ 110 స్థానాల్లో వుంటే భారతదేశం, పాకిస్థాన్‌లు 111వ ర్యాంకును పంచుకున్నాయి.  ఘనా, బోట్స్‌వానా, కాంబోడియా, కజాక్‌స్థాన్‌, ఎల్‌సాల్వడోర్‌లు మనకంటే 40 స్థానాలకు ముందున్నాయి. అయితే ఇథియోపియా, అంగోలా, మయన్మార్‌, బురుండి దేశాలు మనకంటే కొంత దిగువన వుండి  మనకి ఊరట కలిగిస్తున్నాయి.

మొదటి ఐదు స్థానాలను హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌, న్యూజిలాండ్‌ స్విట్జర్‌లాంట్‌, అస్ట్రేలియా, కెనడాలు పొందాయి. ఈ చివరి రెండు దేశాలు ఒకే స్థాయిలో 5వ రాంకు పొందాయి.

ఈ ఆర్థిక స్వేచ్ఛ ర్యాంకులకు దేశాల అభివృద్ధికి మధ్య ఒక సంబంధం వుంది. అదీ మనం గమనించాల్సిన విషయం. సామాజిక రాజకీయ, ఆర్ధికపరమైన ఉన్నతికీ, మెరుగైన వ్యక్తిగత జీవనానికీ ఈ ఆర్ధిక స్వేచ్ఛకీ మధ్య విడదీయరాని అనుబంధం వుంది. ఆర్ధికస్వేచ్ఛ హెచ్చుగా వున్న దేశాలు అది లేని దేశాల కంటే మంచి జీవనంలో  ఉచ్ఛస్థితి లో వుంటున్నాయి.                                     

మొదటి ర్యాంకులు పొందిన నాలుగోవంతు దేశాల సరాసరి స్థూల జాతీయోత్పత్తి చివరి ర్యాంకులు సాధించిన నాలుగోవంతు దేశాల కంటే దాదాపు 7 రెట్లు అధికంగా వుంది.

అలాగే ఈ మొదటి స్థానాల దేశాలలో అత్యంత పేదల సంపాదన చివరి స్థానాలు పొందిన దేశాల కంటే 10 రెట్లు ఎక్కువగా వుంది. అలాగే మొదటి దేశాలలో సగటు జీవితకాలం 79.5 సంవత్సరాలుంటే చివరి స్థానాల దేశాలలో 61.6 శాతం మాత్రమే వుంది. అలాగే రాజకీయ స్వేచ్ఛ, పౌరహక్కుల స్థితిలో కూడా చాలా వ్యత్యాసం వుంది.

మొత్తంమీద రెండు దశాబ్దాలుగా సాగిన ఈ అధ్యయనాలు ఎక్కడ ఆర్ధిక స్వేచ్ఛ ఎక్కువగా వుంటే అక్కడ ఆర్ధిక వ్యవస్థలో పెట్టుబడుల రేటు హెచ్చుగా, ఆర్ధిక ప్రగతి రేటు హెచ్చుగా వుందని స్పష్టం చేస్తున్నాయి. పెరుగుతున్న ఆదాయాలు, తరుగుతున్న పేదరికం కనిపిస్తున్నది. అలాగే ఆర్ధిక స్వేచ్ఛ వున్న దేశాలలో ఆర్ధిక, రాజకీయ, న్యాయవ్యవస్థలు ఆ దేశాల తలసరి ఆదాయాలను పెంచడంలో, ఆర్ధికాభివృద్ధిని సాధించడంలో ముందున్నాయి.

ఆర్థిక స్వేచ్ఛ నివేదిక రూపొందించడానికి 5 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వాటి ఆధారంగా అభివృద్ధి పట్టికను రూపొందించారు. 1) ప్రభుత్వ వ్యయాల సైజు 2) న్యాయ వ్యవస్థ, ఆస్థిహక్కుకు గల భద్రత 3) నికర డబ్బు    4) అంతర్జాతీయ వాణిజ్యానికి గల స్వేచ్ఛ  5) చట్టాలు. ఈ ఐదు అంశాలలో 24 భాగాలుంటాయి.  అందులో మరిన్ని   ఉప భాగాలుంటాయి.  మొత్తంమీద 42 అంశాలు ఈ పట్టికకు ప్రాతిపదికగా వుంటాయి. అలాగే ప్రతి అంశాన్ని 0-10 స్కేలు మీద వాటి  స్థితిని గుర్తించి అంతిమ పట్టికను రూపొందిస్తారు.

అందుచేత సాధ్యమైనంత శాస్త్రీయ ప్రమాణాలతో ఈ నివేదికలు రూపొందిస్తున్నారని భావించాలి. అలాగే దీనికి అవసరమైన గణాంక వివరాలను ఆయా దేశాల నుండి కాకుండా అంతర్జాతీయ సంస్థల నుండి సేకరించారు. వీటి ఆధారంగా వచ్చిన పాయింట్లు ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. హంగ్‌కాంగ్‌ 89.3 పాయింట్లతో అగ్రస్థానంలో వుండగా 88.0 పాయింట్లతో సింగపూర్‌ ద్వితీయ స్థానంలోనూ తర్వాత అస్ట్రేలియా, న్యూజిలాండ్‌, స్విట్జర్లాండ్‌లు ఉన్నాయి.

భారతదేశంలో 55.2 పాయింట్లతో 119వ స్థానంలో వుండి 111వ ర్యాంకును మాత్రమే పొందింది. గత సంవత్సరంతో పోల్చినపుడు 0.6 పాయింట్లు పెరిగాయి. ఈ  పెరుగుదల పబ్లిక్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ మరియు మోనిటరీ స్వేచ్ఛల మెరుగుదల వల్ల సాధ్యమైంది. అయితే ఇక్కడ సాధించిన పాయింట్లను దేశంలో పెరిగిన అవినీతి కబళించింది. దీనికి తోడు వ్యవస్థాగతమైన లోటుపాట్లు దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది. సమర్ధవంతంగా పనిచేసే న్యాయ, చట్ట వ్యవస్థల లోటు, ఆర్ధిక వ్యవస్థ అంతటా వ్యాపించిన అవినీతి వల్ల క్రియాశీలకంగా వ్యవహరించే ప్రయివేటురంగం మందగమనంలో పడింది. అనేక రంగాలలో ప్రభుత్వ ఆధిపత్యం, దుబారాతో కూడిన సబ్సిడీ వ్యవస్థలతో బడ్జెట్‌లోటు పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది.

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఆటుపోట్లుతో సాగుతున్నాయి. కీలకమైన సేవారంగాల సరళీకరణ ఆగిపోయింది. అయితే కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2012లో ఎఫ్‌డిఐలను ప్రోత్సహించడం ప్రభుత్వ సబ్సీడీలను తగ్గించడం ప్రారంభమైంది.  మొత్తంమీద ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన ఐదు రంగాలలోని 10 విభాగాలలో 1) ఆస్థి హక్కులకు సంబంధించిన స్వేచ్ఛకు 50.00 పాయింట్లు రాగా 2) అవినీతి నుండి స్వేచ్ఛకు అత్యల్పంగా 31.0 పాయింట్లు 3) ప్రభుత్వ వ్యయంలో ప్రమాణాలకు 77.9 పాయింట్లు  4) ద్రవ్యస్వేచ్ఛకు 78.3 పాయింట్లు 5) వ్యాపారస్వేచ్ఛకు 37.3 పాయింట్లు 6) కార్మిక స్వేచ్ఛకు 73.6 పాయింట్లు 7) మోనిటరీ స్వేచ్ఛకు 65.3 పాయింట్లు 8) వాణిజ్య స్వేచ్ఛకు 63.6  9) పెట్టుబడుల స్వేచ్ఛకు 35.0  10) ఫైనాన్షియల్‌ స్వేచ్ఛకు 40.0 పాయింట్లు పొందినట్లు ప్రకటించింది.

మొత్తంమీద భారతదేశంలో చట్టబద్ధపాలన ఒకే తీరున లేదు. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని వ్యవస్థీకృతం చెయ్యడంలో బలహీనతలున్నాయి. న్యాయప్రక్రియ దీర్ఘకాలం తీసుకునేదిగాను, వ్యయంతో కూడుకున్నదిగాను, రాజకీయ ఒత్తిళ్లకు గురయ్యేదిగానూ వుంది. ఆస్థిహక్కుకు సమర్ధవంతమైన భద్రత కల్పించకపోవడం, మేధోహక్కుల పరిరక్షణలో చాలా లోట్లు వున్నాయి. అలాగే అవినీతి ఆరోపణల విచారణకు   ఉద్దేశించిన స్వతంత్ర ప్రతిపత్తి గల అంబుడ్స్‌మన్‌ ఏర్పాటుకు పార్లమెంటు ఆమోదం లభించలేదని పేర్కొంది.

ప్రభుత్వ ఆదాయ వ్యయాల మీద అంచనా వేస్తూ మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో 7.4 శాతం మాత్రమే ఆదాయ పన్నుగా వుంది. ప్రభుత్వ ఖర్చు మాత్రం 27.1 శాతం కావడంతో బడ్జెట్‌ లోటు తప్పడం లేదు.  జి.డి.పి.లో 67.1 శాతం అప్పులభారం వుందని పేర్కొంది.

అలాగే దేశంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి, ఉత్పత్తి సాగించడానికి వ్యయప్రయాసలతో కూడిన పద్ధతులున్నాయి. ఒక వ్యాపారం ప్రారంభించామంటే  సగటున కనీసం 25 రోజులు పడుతుంది. లైసెన్సు పొందడానికి చాలా ఖర్చు వుంటుంది.

అభివృద్ధి చెందని శ్రామిక మార్కెట్‌ వల్ల నిపుణత వుండడం లేదు. ఉపాధిరంగం ప్రధానంగా అసంఘటిత కార్మికులతోనే వుంది. అలాగే ప్రభుత్వం రకరకాల వస్తువుల మీద ధరల నియంత్రణ చేస్తున్నది. ఇవన్నీ  ఆర్థిక స్థిరత్వాన్ని బలహీనం చేస్తున్నాయి.

ఇక వ్యాపారంలో సుంకాలు 8.2 శాతంగా భారంగా వున్నాయి. దీనికితోడు సుంకాలతో నిమిత్తం లేని అడ్డంకులు వున్నాయి. భారతదేశ బ్యూరోక్రసీ కొత్త పెట్టుబడులకు అననుకూల వాతావరణాన్ని కల్పించేదిగా వుంది. తక్కువ ధరలకు ప్రజలకు సరుకులు అందించే బహుళజాతి చిల్లర వర్తకాన్ని అనుమతించడంలో జాప్యం, ప్రభుత్వరంగ సంస్థల ఆధిక్యం వంటివి కొనసాగుతున్నాయని ఈ నివేదిక పేర్కొంది.

మొత్తంమీద ఆర్థిక స్వేచ్ఛకు, అవినీతి నిరోధకానికి తగిన చర్యలు అరకొర కావడం వల్లనే భారతదేశం అభివృద్ధి వేగం మందగించిందనేది దీని సారాంశం.

మన రాష్ట్రాలు : ఆర్ధిక స్వేచ్ఛ

భారతదేశంలో ప్రధానమైన 20 రాష్ట్రాలలో ఆర్ధిక స్వేచ్ఛ స్థితిపై మరో రిపోర్టు విడుదలైంది. 2009-2011 గణాంకాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ఆయా రాష్ట్రాలకు ర్యాంకులను ప్రకటించింది. ఇందులో గుజరాత్‌ రాష్ట్రం మొదటిస్థానాన్ని పొందగా చివరగా బీహార్‌ వుంది. 2005లో 5వ స్థానంలో వున్న గుజరాత్‌ మొదటి స్థానాన్ని అందుకోగా బీహారు స్థానం అక్కడే వుండిపోయింది. అయితే బీహారు తన స్కోరు పాయింట్లను మాత్రం పెంచుకుంది.

జర్మనీకి చెందిన ఫ్రెడరిచ్‌ న్యూమాన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆర్థికవేత్తలు వివేక్‌ డెబ్రాయ్‌, లవీఫ్‌ భండారీలు ఈ రిపోర్టును రూపొందించారు. ప్రపంచదేశాల ఆర్థిక స్వేచ్ఛ కొలమానాలనే వీరు ఉపయోగించారు. స్వేచ్ఛ మార్కెట్‌ను సమర్ధించే కాంటో ఇన్‌స్టిట్యూట్‌ ఈ నివేదిక రూపకల్పనలో భాగస్వామిగా వుంది.

2005, 2009 సంవత్సరాలలో ఆర్థిక స్వేచ్ఛలో మొదటి స్థానంలో వున్న తమిళనాడు రెండోస్థానం పొందింది. అలాగే 6వ స్థానంలో వున్న మధ్యప్రదేశ్‌ మూడవ స్థానానికి చేరింది.

అలాగే 2005లో 7వ స్థానంలో వున్న ఆంధ్రప్రదేశ్‌ 2009లో 3వ స్థానాన్ని పొందినా 2011 నాటికి 6వ స్థానానికి దిగజారింది. హర్యానా రాష్ట్రం స్థిరంగా 4వ స్థానాన్ని 2005 నుండీ నిలబెట్టుకుంది.

ప్రపంచంలో భారతదేశం స్థానం దిగజారుతున్న రాష్ట్రాలలో పనితీరు అంతకంటే మెరుగుగా కనిపిస్తున్నది.

ఒకనాడు ఆర్థిక వ్యవస్థకు పవర్‌హౌస్‌గా వున్న పంజాబు ఇప్పుడు 12వ స్థానానికి పడిపోయింది. దీనికి ద్రవ్యలోటు, విచ్చలవిడిగా, జనాకర్షణ పధకాలు కారణంగా కనిపిస్తున్నాయి. మొత్తంమీద వివిధ రాష్ట్రాలలో అవినీతి పెరుగుదల, ప్రభుత్వాల వ్యయం,  న్యాయం, చట్టపరమైన అంశాల అమలు, వ్యాపార వాణిజ్య స్వేచ్ఛలను అంచనా కట్టడానికి ఈ నివేదికలు ఉపయోగపడేవిగా వున్నాయి.
 
                                                                                   ***


గ్రామీణ పాఠశాలల విద్యా స్థితిపై అసర్‌ నివేదిక
పెరుగుతున్న పిల్లల నమోదు తరుగుతున్న విద్యాప్రమాణాలు

                                                                                                                  - డి.వి.వి.యస్‌. వర్మ                                                                          
 2012 సంవత్సరం ముగిసింది. దేశంలో పాఠశాల విద్యపై అసర్‌ (యాన్యువల్‌ స్టేటస్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు) వార్షిక నివేదిక 2013 జనవరి 17న కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి డా.యం.పళ్లంరాజు చేతుల మీదుగా విడుదలైంది. ఈ నివేదికలో వెల్లడైన అంశాలు పాఠశాల విద్య గురించి అందరూ మాట్లాడుకుంటున్నవే అయినప్పటికీ వాటిని పదేపదే ఒక ప్రామాణికమైన వార్షిక సర్వే ద్వారా అసర్‌ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

మన పిల్లల చదువుకు పాఠశాల విద్య పునాది. ఈ చదువే మన సమాజంలో చాలా సమస్యలకు పరిష్కారం. మంచి ప్రమాణాల చదువు దేశాన్ని తిరుగులేని అభివృద్ధి క్రమంలో నడిపిస్తుంది. ప్రజలకు స్వతంత్ర జీవనాన్ని కల్పిస్తుంది. అంతకుమించి మన సమాజంలో అనేక వివక్షలున్నాయి. కులవివక్ష, లింగవివక్ష, పేదరికపు వివక్షలున్నాయి. చదువు ఈ అంతరాలను తొలగిస్తుంది. వారి సామాజిక హోదాను మారుస్తుంది. ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరిగే స్వతంత్ర జీవనాన్ని ఇస్తుంది.

మనకి ప్రభుత్వ లేదా ప్రయివేటు పాఠశాలలు ఇబ్బడి ముబ్బడిగా వున్నాయి. పిల్లల నమోదు శాతం గణనీయంగా పెరుగుతున్నది. ఏటా పిల్లలు తరగతులు దాటుతున్నారు. డిగ్రీలు, డిప్లమోలు పొందుతున్నారు. కాని పనికొచ్చే చదువు మాత్రం దక్కడం లేదు. పిల్లల శక్తి సామర్ధ్యాలను ఈ చదువు పెంచడం లేదు. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయి. ప్రయివేటు పాఠశాలలు నిత్యపరీక్షల పేరుతో రుబ్బుడు, దిద్దుడు తప్ప పిల్లలలో వివేచనాశక్తిని పెంచడం లేదు .

ఈ స్థితిని ఒక అసర్‌ నివేదికలే కాదు, భారతదేశంలో విద్యమీద జరిపిన సర్వేలన్నీ ఈ స్థితికి అద్దం పడుతున్నాయి. గత  సంవత్సరం వచ్చిన మూడు రిపోర్టులు దీనిని ధృవపరుస్తున్నాయి. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి వహించిన ''పీసా'' సర్వేప్రకారం భారతదేశంలో 10వ తరగతి పిల్లల చదువు సామర్ధ్యం అత్యంత హీనస్థితిలో వున్నట్లు  వెల్లడించింది.  ఆ సంస్థ 74 దేశాలలో విద్యాస్థితిని అంచనా వేస్తే  భారత దేశం 73వ స్థానంలో అట్టడుగున నిలిచింది.  చైనా మొదటి స్థానంలో  వుండగా అమెరికా 16వ స్థానాన్ని పొందింది.  విద్యార్థుల మాతృభాషా పరిజ్ఞానాన్ని, లెక్కలలో సామర్థ్యాన్ని, వారి తర్క పుష్టిని ప్రమాణాలుగా తీసుకుని చేసిన సర్వేలో మన పిల్లల వెనకబాటుతనం స్పష్టమైంది.

అలాగే విప్రో ఇఎల్‌ చేసిన క్వాలిటీ ఎడ్యుకేషన్‌ స్టడీ ప్రకారం అగ్రస్థానంలో వున్న కొన్ని ప్రయివేటు పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు 2006నాటి కంటే 2010లో చాల బలహీనపడ్డాయని తేల్చింది. అలాగే గత 2011 అసర్‌ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు నానాటికీ తీసికట్టు కావడాన్ని చూపించింది.

భారతదేశంలో ప్రధమ్‌ సంస్థ 2005 నుండి క్రమం తప్పకుండా వార్షిక విద్యాస్థితి నివేదికలను విడుదల  చేస్తున్నది. ఈ 2012 సర్వే 8వ వార్షిక నివేదిక. ఈ సర్వే 567 జిల్లాలలో 1600 గ్రామాలలో 3.3 లక్షల కుటుంబాలకు చెందిన  3-16 సంవత్సరాల పిల్లల చదువు స్థితి మీద నిర్వహించారు. 6 లక్షల మంది విద్యార్థుల చదువు సామర్ధ్యాన్ని  అంచనా కట్టారు. పనిలో పనిగా 2010 విద్యాహక్కు చట్టం వచ్చిన తర్వాత  ఆ చట్టం ప్రమాణాలు పాఠశాలలలో ఎలా వున్నాయో పరిశీలించడానికి 14,600 ప్రభుత్వ పాఠశాలల స్థితిని సేకరించారు. వీటన్నింటి ఫలితాలను క్రోడీకరించి 2012 అసర్‌ నివేదికగా వెల్లడించారు.


గ్రామీణ భారతంలో విద్యాస్థితి

పాఠశాలలో 6-14 వయసు గల పిల్లల నమోదు హెచ్చుస్థాయిలోనే 96.5 శాతంగా వుంటున్నది. పాఠశాలలో నమోదు కాని వారి సంఖ్య 3.3 నుండి 3.5 శాతం మధ్య వుంటున్నది. పోతే 11-14 సంవత్సరాల వయస్సు గల బాలికలు పాఠశాలలకు దూరం కావడం పెరుగుతున్నది.  ఇందులో రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లు 11 శాతంతో అగ్రస్థానంలో ఉన్నాయి.

ప్రయివేటు మోజు

అన్ని రాష్ట్రాలలో 2006లో ప్రయివేటు పాఠశాలలో 18.7 శాతం  బాలబాలికలు వుంటే 2012లో ప్రైయివేటు పాఠశాలలో పిల్లల వాటా 28.3 శాతానికి పెరిగింది. అత్యధికంగా కేరళ, మణిపూర్‌లలో 60 శాతం మంది, జమ్ము-కాశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, గోవా, మేఘాలయాలలో 40 శాతం మంది బాలబాలికలు ప్రయివేటు పాఠశాలల్లోనే వున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా జాతీయ సరాసరిని మించి 36.5 శాతం మంది ప్రయివేటు పాఠశాలల్లోనే వున్నారు.

మొత్తంమీద ప్రయివేటు పాఠశాలలో పిల్లల నమోదు సంఖ్య ప్రతిఏటా 10 శాతం చొప్పున పెరుగుతున్నది. ఇలాగే కొనసాగితే 2018 నాటికి ప్రయివేటు పాఠశాలల్లో పిల్లల నమోదు 50 శాతానికి మించుతుందని ఈ నివేదిక అంచనావేసింది.


చదువు ఎలా వుంది

దేశవ్యాప్తంగా 2010లో 46.3 శాతం 5వ తరగతి పిల్లలు 2వ తరగతి స్థాయి పుస్తకాన్ని చదవలేకపోయారు. అలాగే 2011లో ఇది 51.8 శాతానికి, 2012లో 53.2 శాతానికి చదవలేని వారి సంఖ్య పెరిగింది. చదవలేని వారు ప్రభుత్వ పాఠశాలల్లో కొంచెం ఎక్కువగా ఉన్నారు. 2010లో 49.3 శాతం, 2011లో 56.2 శాతం, 2012లో 58.3 శాతం అంటే చదవలేని పిల్లల సంఖ్య పెరుగుతున్నది.

2010లో 5తరగతి చదువుతున్న పిల్లలలో 29.1 శాతం 2 సంఖ్యల తీసివేతల్ని  చేయలేకపోయారు. అది 2011 కల్లా 39 శాతానికి చేరి, 2012 కల్లా 46.5 శాతానికి చేరుకుంది.

5వ తరగతి చదువుతున్న పిల్లలలో 2010లో 63.8  2011లో 72.4 , 2012లో 75.2 శాతం మంది పిల్లలు చిన్న చిన్న భాగాహారాలు కూడా చేయలేకపోతున్నారు. 

2012 అసర్‌ సర్వేలో తేలిక ఇంగ్లీషు పదాలు, వాక్యాల చదువు సామర్థ్యాన్ని కూడా పరీక్షించారు. గ్రామీణ భారతంలో  5వ తరగతి చదువుతున్న పిల్లలలో 51.1 శాతం మంది   ఇంగ్లీషు పదాలు చదవలేకపోతున్నారు.

5వ తరగతి పిల్లలు ఇంగ్లీషులో సామాన్య వాక్యాలను 77.5 శాతం మంది చదవలేకపోతున్నారు. అలాగే ఏడవ తరగతి పిల్లలలో 53 శాతం మంది ఇంగ్లీషు వాక్యాలను చదవలేక పోతున్నారు.


ట్యూషన్లకు ఎంతమంది వెళుతున్నారు....

ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో కలిపి 1 నుండి 8వ తరగతి వరకు మొత్తం నమోదయిన పిల్లలలో  4వ వంతు పిల్లలు ప్రైవేటు ట్యూషన్లకు వెళుతున్నారు.

2012లో ప్రభుత్వ పాఠశాలలలో 5వ తరగతి  చదువుతూ ట్యూషన్లకు వెళ్ళని వారు 54.5 శాతం.  ట్యూషన్లకు వెళ్ళేవారు 18.8 శాతం వున్నారు.

టూషన్లకు వెళుతున్నవారి సామర్థ్యాలు, వెళ్ళని వారి కంటే పెరుగుతున్నాయన్నది ఈ సర్వేలో తేలింది.

గత రెండేళ్లలో ట్యూషన్‌కు వెళ్లే ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థు సంఖ్య తగ్గింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే ఐదో తరగతి విద్యార్థులు 2011లో 13% మంది ట్యూషన్లకు వెళ్లగా.... 2012లో అది 7.7 శాతానికి తగ్గింది.


ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే స్థితి


రాష్ట్రంలో 6-14 ఏళ్ల పిల్లల్లో 97.4% మంది బడుల్లో చేరారు. 2007 సంవత్సరంతో పోలిస్తే ఇది 1.6% పెరిగింది.

11-14 ఏళ్ల పిల్లల్లో 5.1% మంది ఇప్పటికీ బడులకు వెళ్లటం లేదు. దేశవ్యాప్తంగా వీరి శాతం మరింత ఎక్కువగా కనిపిస్తోంది.

మూడో తరగతి విద్యార్థుల్లో 48.7% మంది మాత్రమే ఒకటో తరగతి పాఠ్యపుస్తకాలను చదవగలుగుతున్నారు.

ఐదో తరగతి విద్యార్థుల్లో 59.4% మంది మాత్రమే రెండో తరగతి పాఠ్యపుస్తకాలను చదవగలుగుతున్నారు.

ఐదో తరగతి చదివేవారిలో 40% మంది ప్రాథమిక పఠన నైపుణ్యాలు  వుండటం లేదు. మూడో తరగతి పిల్లల్లో సగం మంది మాత్రమే రెండంకెల తీసివేత లెక్కలను చేయగలుగుతున్నారు. ఇక ఐదో తరగతి విద్యార్థుల్లో 41.1% మందికే భాగహారం లెక్కలు చేయటం తెలుసు. అంటే 59% మంది విద్యార్థులు కనీస గణితస్థాయిలను అందుకోకుండానే ప్రాథమిక పాఠశాల చదువు పూర్తిచేస్తున్నారు.

మూడో తరగతి చదివేవారిలో 61.4% మంది పిల్లలు ఆంగ్లలో సరళ పదాలను చదవగలుగుతున్నారు. మిగిలిన వారిలో కొందరు  అక్షరాలను మాత్రమే గుర్తించగలుగుతున్నారు. 65.5% విద్యార్థులు మాత్రమే పదాల అర్థాలను ఆంగ్లంలో చెబుతున్నారు.

మొత్తంమీద  పాఠశాల విద్యాస్థితి దారుణంగా వుందనేది ఈ రిపోర్టు సారాంశం. ఇక సమస్యల వర్ణనవల్ల అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ వుండదు. ఈ స్థితిని మార్చడం ఎలా అన్నదే అసలు ప్రశ్న.

పాఠశాల విద్యలో అరకొర మార్పులు పరిస్థితిని చక్కదిద్దలేవు. ఒక ప్రణాళికతో సమగ్రమైన ప్రక్షాళనకు పూనుకోవాలి. సిలబస్‌ మారాలి, పుస్తకాలు మారాలి, బోధన మారాలి. మాతృభాషలో బోధన, ఇంగ్లీషు నేర్పించడాన్ని మేళవించాలి. విద్యార్థుల స్థాయిని అంచనా కట్టడానికి ఏదో ఒక తరహా పరీక్షలుండాలి. ఉపాధ్యాయులలో జవాబుదారీతనం పెంచడానికి  అజమాయిషీని పటిష్టం చెయ్యడానికి తగిన ప్రోత్సాహకాల పద్ధతుల్ని ప్రవేశపెట్టాలి. ప్రభుత్వ, ప్రయివేటు తేడా లేకుండా  అందరికీ మంచి ప్రమాణాల విద్య అందాలి. దీనికి ప్రభుత్వాలు చొరవ చూపాలి. మన రాజకీయానికి ఓట్ల ధ్యాస వుందే తప్ప మార్పు యోచన లేదు. డబ్బుతో, కులంతో, పేదరికంతో నిమిత్తం లేకుండా అందరికీ మంచి ప్రమాణాల విద్యను అందించడం.  లక్ష్యంగా విధానపరమైన రాజకీయ చర్చ జరిగితేనే తప్ప పిల్లల చదువుకు భవిష్యతు వుండదు. 
 
                                                                          ***

DVVS Varma in EVT2 Prathidvani on Local Elections



-----------------------------------------------------------------------------------------------------

రాష్ట్రాలలో కోరలు లేని లోకాయుక్తలు

 రాష్ట్రాలలో కోరలు లేని లోకాయుక్తలు 

                                                                                                                      - డి.వి.వి.యస్‌. వర్మ


2011 మే నెలలో మన రాష్ట్రప్రభుత్వం లోకాయుక్త చట్టానికి కొన్ని సవరణలు తెచ్చింది. లోకాయుక్త పరిధిని కిందిస్థాయి ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు విస్తరింపజేసింది. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌, సర్పంచులు, కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌లను, ఆర్‌డివో, అంతకు కిందిస్థాయి రెవెన్యూ  ఉద్యోగులను, డియస్‌పి, తదితర పోలీసు శాఖ సిబ్బందీని దీని పరిధిలోకి తెచ్చారు. అలాగే రాష్ట్రంలో వున్న కేంద్ర ప్రభుత్వం సంస్థలలో పనిచేసే ఉద్యోగుల అవినీతి సంబంధమైన అభియోగాలను దీనిపరిధి కిందకు తెచ్చారు.

అయితే కీలకమైన లోకాయుక్త అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో పనిచేసినా, ఇప్పుడు పనిచేస్తున్న లోకాయుక్తలు, రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్న విధంగా అధికారాల విస్తరణ మాత్రం జరగలేదు.

లోక్‌పాల్‌ బిల్లులో భాగంగా  దేశానికంతటికీ వర్తించే లోకాయుక్తలు కూడా వస్తాయని భావించడం జరిగింది. కాని ప్రాంతీయ పార్టీల ఒత్తిడికి తలొగ్గినందువల్ల లోక్‌పాల్‌లో అంతర్భాగంగా రావాల్సిన లోకాయుక్తలు వచ్చే అవకాశం లేదని తేలింది. ఈ నేపధ్యంలో వివిధ రాష్ట్రాలలో లోకాయుక్తలను సమీక్షించుకోవడం, అవినీతిలో అన్ని రాష్ట్రాలను మంచి అగ్రస్థానంలో వున్న ఈ రాష్ట్రంలో బలమైన లోకాయుక్త సాధనకు ఎంతో అవసరం.

రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో అవినీతిని, అధికార దుర్వినియోగాన్ని నివారించడానికి ప్రజాప్రతినిధులలో, అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచడానికి లోకాయుక్తలు ఉద్దేశించబడ్డాయి. భారతదేశంలో 1966లో మొదటి పాలనా సంస్కరణల సంఘం ఇలాంటి వ్యవస్థ అవసరాన్ని నొక్కి చెప్పింది. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి, ప్రజాప్రతినిధులలో, పౌరసేవలలో అవినీతిని నిరోధించడానికి ఇలాంటి ప్రత్యేక వ్యవస్థలు అవసరమని భావించింది. జాతీయస్థాయిలో లోక్‌పాల్‌, రాష్ట్రాల స్థాయిలో లోకాయుక్త వ్యవస్థలను సిఫారసు చేసింది. ఈ సిఫారసుల ఆధారంగా దేశంలో ఈ వ్యవస్థల రూపకల్పనకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి.

కేంద్రంలో లోక్‌పాల్‌ 

1968, 1971, 1977, 1985, 1989, 1996, 1998, 2001 కేంద్రంలో లోక్‌పాల్‌ ఏర్పాటుకు పార్లమెంటు ముందుకు బిల్లులు వచ్చాయి. కాని ఏదో ఒక కారణంతో అది మురుగిపోతూ వచ్చాయి. 2011లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన లోక్‌పాల్‌ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో చతికిలబడి అలాగే వుండిపోయింది.

రాష్ట్రాలలో లోకాయుక్తలు

ప్రస్తుతం దేశంలో 19 రాష్ట్రాలలో లోకాయుక్త -   ఉపలోకాయ్తు చట్టాలు, వ్యవస్థలు వున్నాయి. మహారాష్ట్ర (1971) బీహారు (1973) రాజస్థాన్‌ (1973) ఉత్తరప్రదేశ్‌ (1975) మధ్యప్రదేశ్‌ (1981) ఆంధ్రప్రదేశ్‌ (1983) హిమాచల్‌ప్రదేశ్‌ (1983) కర్నాటక (1985) అస్సాం (1986) గుజరాత్‌ (1986) కేరళ (1988) పంజాబ్‌ (1995) ఢిల్లీ (1996) హర్యానా (1996) లలో ఇలాంటి చట్టాలు, వ్యవస్థలు వచ్చాయి.  దేశంలో మొట్టమొదటిగా ఒరిస్సాలో 1970లోనే ఈ వ్యవస్థ ఏర్పడినా 1993లో దానిని రద్దు చేశారు.

2011లో ఉత్తరాఖండ్‌లో దీనికి ఒక చట్టం చేసినా అది ఇంకా రాష్ట్రపతి ఆమోదం పొందనందున అమలులోకి రాలేదు.

లోకాయుక్తల పనితీరు

దేశంలో మొత్తంమీద లోకాయుక్తల పనితీరు పూర్తిగా నిరాశాజనకంగా వుంది. రాష్ట్రాలలోని పాలకవర్గాలు ఈ వ్యవస్థలను బలోపేతం చెయ్యడానికి బదులు నీరుగారుస్తూ వచ్చాయి. తమ అవినీతిని, పాలనలో అవినీతిని మరుగునపర్చడమే లక్ష్యంగా  వీటికి అధికారాలు, నిధులు, సిబ్బంది లేకుండా చేశాయి. పశ్చిమబెంగాల్‌లో లోకాయుక్త ఆఫీసులో ఇద్దరే ఇద్దరు సిబ్బంది అదీ గ్రూపు డి స్థాయి ఉద్యోగులు మాత్రమే వున్నారు. గుజరాత్‌లో 2003 నుండి 2011 వరకు లోకాయుక్త లేకుండానే సాగిపోయింది. 2011లో గవర్నరు ఈ పదవిని నామినేషన్‌ ద్వారా భర్తీ చెయ్యడంతో ఆయనపై గుజరాత్‌ ప్రభుత్వం విరుచుకుపడింది. కోర్టు తీర్పు ఈ నియామకాన్ని  సమర్ధించింది.

దేశంలోనే కర్నాటకలో వున్న లోకాయుక్త చట్టం బలమైంది. దానికి  అధికారాలు, సిబ్బందికి తగిన ఏర్పాట్లు వున్నాయి. ఈ చట్టం పరిధిలో ముఖ్యమంత్రి కూడా వున్నారు. ఈ లోకాయుక్త ముందు నలుగురు మాజీ ముఖ్యమంత్రుల కేసులు విచారణలో వున్నాయి.  ఇక్కడ లోకయుక్తగా వున్న సంతోష్‌ హెగ్డే ఆ రాష్ట్రంలో జరిగిన గనుల కుంభకోణాన్ని వెలికితీశారు. 12 వేల కోట్ల విలువైన అక్రమ గనుల తవ్వకంలో సాక్ష్యాధారాలను ప్రకటించారు. అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి 21 రోజులపాటు జైలులో వుండాల్సి వచ్చింది. సంతోష్‌ హెగ్డే పదవీవిరమణ తర్వాత 6,7 నెలలు గడిచినా అక్కడ ప్రస్తుతం లోకాయుక్త లేదు. ఒక లోకాయుక్తను నియమిస్తే ఆయనపై ఆరోపణలు రావడంతో వైదొలగారు. తగిన లోకాయుక్త కోసం వెదుకులాడే నెపంతో కాలయాపన సాగిపోతున్నది.

కేరళలో లోకాయుక్త పరిధిలో ముఖ్యమంత్రితో సహా అన్ని స్థాయిల రాజకీయ ప్రజా ప్రతినిధుల మీద, పాలనా వ్యవస్థలోని ఉద్యోగుల మీద అధికారాన్ని కలిగి వుంది. కాని దానికి తనంతట తాను చొరవ తీసుకుని విచారణ జరిపే అధికారం లేదు. దానికి స్వంత సిబ్బంది లేదు. రాష్ట్ర సచివాలయంలో భాగంగానే పనిచేస్తున్నది. అయినప్పటికీ అది యు.డి.ఎఫ్‌ మంత్రి కె.కె.రామచంద్రన్‌ మీద ఉచ్చు బిగించింది. ఆయన రాజీనామా చేయకతప్పలేదు.

2011లో ఉత్తర ప్రదేశ్‌లో లోకాయుక్త కొంత చొరవను ప్రదర్శించింది. మాయావతి మంత్రివర్గంలో 9 మందికి  ఉద్వాసన చెప్పాల్సివచ్చింది. మరో 19 మంది మంత్రుల మీద నేరపరిశోధన  సాగిస్తున్నది. అయితే అక్కడ లోకాయుక్తకి ప్రాసిక్యూషన్‌ నిర్వహించే అధికారం లేదు. నేర పరిశోధన విభాగంలో తగినంత మంది సిబ్బంది లేదు. అంతకు మించి లోకాయుక్త సిఫారసులు ప్రభుత్వం తప్పనిసరిగా అమలుచేసి తీరాలన్న నిబంధన లేదు.

ఇక మిగిలిన రాష్ట్రాలలో ఇలాంటి పరిస్ధితి కూడా లేదు. లోకాయుక్తలను ఏర్పాటు చేసి ఊరుకున్నారే తప్ప అవి పని చెయ్యడానికి తగిన ఏర్పాట్లు ఏ మాత్రం చెయ్యడం లేదు. 1972 నుండీ మహారాష్ట్రకు లోకాయుక్త           ఉన్నప్పటికీ, దానికి నేరపరిశోధన అధికారాలున్నప్పటికీ విచారణ చేసే అధికారం లేదు. స్వంత నేరపరిశోధనకు ఏర్పాటు లేదు. ఆ రాష్ట్రంలో విజిలెన్స్‌ కమిషన్‌ను కూడా ఏర్పాటు చెయ్యలేదు.  1973 నుండి రాజస్థాన్‌లో లోకాయుక్త వ్యవస్థ ఉన్నప్పటికీ దాని పరిధిలో కేవలం ఉద్యోగులు తప్ప ప్రజా ప్రతినిధులు లేరు. దానికి నేర పరిశోధనా విభాగం లేదు. శిక్షించే అధికారమూ లేదు. అస్సాంలో ఉపలోకాయుక్తే లోకాయుక్తగా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రిపై వచ్చిన ''డంపర్‌స్కామ్‌'' విషయంలో లోకాయుక్త ఆయనను నిర్దోషిగా చూపెట్టడం అందరి విమర్శలకూ గురైంది.

తమిళనాడులో లోకాయుక్త ఏర్పాటు గురించి ఎవరూ ఆలోచించిన పాపాన పోలేదు. పైగా కేంద్రంలో ఇటీవల లోక్‌పాల్‌ బిల్లులో భాగంగా రాష్ట్రాలకు లోకాయుక్తలను ఏర్పాటు చెయ్యాలన్న ప్రతిపాదనలను డి.యం.కె. అన్నా డి.యం.కె పార్టీలు రెండూ వ్యతిరేకించాయి. ఇక్కడ విజిలెన్స్‌ డైరెక్టర్‌ అవినీతి నిరోధక సంస్థ దాదాపు అన్ని అవినీతి కేసుల్ని రిజష్టర్‌ చేస్తున్నాయి. అవినీతి నిరోధక సంస్థ ప్రభుత్వం అధీనంలో వుంది. పైగా దానికి ప్రభుత్వ అనుమతి లేకుండా విచారణ చేసే అధికారం కూడా లేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో లోకాయుక్త - ఉప లోకాయుక్తలు వున్నారు. 133 మంది సిబ్బంది  ఉండాల్సిన చోట 22 మాత్రమే ఉన్నారు. వీరు చెయ్యగలిగింది నామమాత్రంగానే వుంది. ఎక్కడైనా ప్రభుత్వ యంత్రాంగం విధి విధానాలు అమలులో నిర్దిష్టమైన పొరబాట్లు జరిగితే వాటిని చక్కదిద్దడం. జాప్యం జరిగితే దానిని సరిదిద్దడం వంటి చర్యలు తప్ప తీవ్రమైన నేరాలు చేసిన వారిని బోనులో నిలబెట్టే స్థితి లేదు.

ఇటీవల బీహారులో పాత చట్టాన్ని సవరించారు. ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రుల్ని దాని పరిధిలోకి తెచ్చారు. అయితే దాని అమలుతీరు ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే. ఇకపోతే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు 2011లో అన్ని హంగులు గల బలమైన లోకాయుక్త చట్టాన్ని ఆమోదించింది. అయితే అది అతి తెలివిని ప్రదర్శించింది. గొప్ప చట్టాన్ని తెచ్చామన్న ప్రచారం రావాలి. కాని అది అమలు కాకుండా వుండేలా చూడాలి అన్న సూత్రాన్ని పాటించారు. రాష్ట్రాల అధికారాల పరిధికి మించిన అంశాలను జోడించి ఈ బిల్లును రూపొందించారు గవర్నరు ఆమోదంతో సరిపోయే దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి వచ్చింది. అందువల్ల దీని ఆమోదం ప్రశ్నార్ధకంగానే మిగిలింది.

మొత్తంమీద రాష్ట్రాలలో పెచ్చరిల్లుతున్న అవినీతిని అరికట్టే విధంగా ఈ లోకాయుక్తలు లేవు. వీటికి తమంతట తాము కేసు నమోదు చేసే అధికారం వుండాలి. అనుమతుల అడ్డంకులన్నిటినీ తొలగించాలి. లోకాయుక్తలకు స్వతంత్రమైన నేరపరిశోధనా విభాగం, స్వతంత్రమైన ప్రాసిక్యూషన్‌ వ్యవస్థ వుండాలి. సత్వర విచారణలకు ప్రత్యేక కోర్టులు, అక్రమ ఆస్తుల స్వాధీనానికి అధికారాలు వుండాలి. లోకాయుక్తల నియామకం పారదర్శకంగా ప్రభుత్వం ప్రతిపక్ష నేత, ప్రాతినిధ్యం వహించే కమిటీ ఏకాభిప్రాయంతో సాగే పద్ధతి వుండాలి. సమర్థులనీ, నిజాయితీ పరుల్ని ఎంపిక చెయ్యడం మీద శ్రద్ధ చూపాలి అలాంటి కోరలు గల లోకాయుక్తలు మాత్రమే అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయి. ప్రజా చైతన్యంతోనే ఇలాంటి వ్యవస్థలు సాధ్యం అవుతాయి.  

                                                   ***






 




లక్ష్య సాధనాలుగా నగదు బదిలీలు

              లక్ష్య సాధనాలుగా నగదు బదిలీలు  

                                                                                              - డి.వి.వి.యస్‌. వర్మ

2012 సెప్టెంబర్‌ 1 నుండి రాష్ట్రంలో కిరోసిన్‌కు నగదు బదిలీ పధకం ప్రయోగాత్మకంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్‌ జిల్లాలో 10, తూర్పుగోదావరి జిల్లాలో 35,  మొత్తం 45 రేషన్‌షాపులలో ఈ పధకం అమలుకు శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం పట్టణాలలో రేషన్‌కార్డుల మీద పేదలకు నెలకు నాలుగు లీటర్లు, ఇతర ప్రాంతాలలో రెండు లీటర్లు, దీపం పధకం కింద సిలిండర్‌ పొందిన వారికి 1 లీటరు చొప్పున రేషన్‌షాపుల ద్వారా  ఇస్తున్నారు. ప్రభుత్వం లీటరు కిరోసిన్‌కు  48 రూపాయలకు కొనుగోలు చేసి లబ్ధిదారులకు 15 రూపాయలకు అందిస్తున్నది. అంటే ప్రతి లీటరుకు ప్రభుత్వం 33 రూపాయలు సబ్సీడీని భరిస్తున్నది. ఈ నగదు బదిలీ అమలులోకి వచ్చేచోట ఎన్ని లీటర్లకు లబ్ధిదారులు అర్హులైతే అన్ని లీటర్లకు 33 రూపాయల వంతున వారి బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. లబ్ధిదారులు మార్కెట్‌ ధరకు కిరోసిన్‌ను కొనుగోలు చేసుకోవాలి. ఒక నెలలో వారు కొనుగోలు  చేయకపోతే ఆ మొత్తం తిరిగి ప్రభుత్వానికి చేరుతుంది. లబ్ధిదారులకు విధిగా ఆధార్‌కార్డులు వుండేలా, బ్యాంకు ఖాతాలు వుండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ సక్రమంగా జరిగినప్పటికీ ప్రభుత్వం ఆశిస్తున్నట్లుగా కిరోసిన్‌ అవసరం లేని కొనుగోలుదారుల్ని, ఆ తర్వాత జరిగే బ్లాక్‌ మార్కెట్‌నూ ఇది నిరోధించేదిగా లేదు. గతంలో లాగే అవసరం లేనివారు లీటరుకు పదో, పదిహేనో డబ్బును డీలర్‌ నుండి పొంది సంతృప్తిపడే పరిస్థితే  కొనసాగుతుంది. పోతే నిజంగా అవసరం వున్న వారికి మార్కెట్‌లో కిరోసిన్‌ ధర పెరిగితే ఆ అదనపు మొత్తాన్ని తామే భరించుకోవలసి వస్తుందన్న ఆందోళన వుంది.  అందుచేత నగదు బదిలీ పధకాలను ప్రవేశపెట్టేముందు అనుకున్న లక్ష్యాలు సాధించే విధంగా వాటిని రూపొందించడం అవసరం.

 

2012-13 సంవత్సరానికి కేంద్రబడ్జెట్‌పై ఆర్ధికమంత్రి ప్రసంగంలో ఎరువులు, గ్యాస్‌సిలిండర్లు, కిరోసిన్‌లపై ఇస్తున్న పరోక్ష సబ్సీడీల స్థానంలో నేరుగా లబ్ధిదారుకు నగదు బదిలీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇది చిన్న విషయం కాదు. విధానపరంగా పెద్దమలుపు. దీనివెనుక చాలా కారణాలు వున్నట్టు కనిపిస్తున్నది. రాను రాను సబ్సీడీల భారం పెరుగుతూపోవడంతో బడ్జెట్లు దీనిని భరించలేని స్థితి ఏర్పడింది. 2001లో 7, 500 వేల కోట్లు వున్న కిరోసిన్‌ సబ్సీడీ 2011నాటికి 20 వేల 500 కోట్లకు పెరిగింది. అదేకాలంలో  గ్యాస్‌ సిలిండర్ల మీద సబ్సీడీ 6 వేల 700 కోట్లు నుండి  24,000 కోట్లు అయింది. డీజిల్‌ మీద సబ్సీడీ 7,500 కోట్లు నుండి 34,000 కోట్లు, ఎరువుల మీద వున్న14,000 కోట్లు వుంటే అది 55,000 కోట్లకీ, ఆహార వస్తువుల మీద 12,000 కోట్లు వుంటే సబ్సీడీ 2011 నాటికి 60,500 కోట్లు అయింది. ఇంతగా సబ్సీడీలు ఇస్తున్నా వ్యవసాయరంగంలో, పేదరికనిర్మూలనలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. పైగా ఈ సబ్సీడీలు దారిమళ్లడం, అవినీతికి ఆలవాలం కావడం సాగిపోతున్నది. సొమ్ముపోయే శనిపట్టినట్టు పరిస్థితి తయారైంది.

 

మరొకపక్క బోగస్‌కార్డుల ఏరివేతకు తగిన సాంకేతిక పరిజ్ఞానం రావడం, ఆధార్‌కార్డుల పంపిణీ పెద్దఎత్తున సాగించడం, బ్యాంకులు, పోస్టాఫీీసులు ఆర్ధిక లావాదేవీలను సమర్ధవంతంగా నిర్వహించగల స్థితిలో వుండడం, జాతీయ ఉపాధిపధకం అమలులో నేరుగా లబ్ధిదారులకు వేతనాల పంపిణీ వంటి అనుభవాలు గత సబ్సీడీపద్ధతి మార్చాలన్న ప్రయత్నాలకు సానుకూల అంశాలుగా భావించబడుతున్నాయి. ప్రపంచంలో పలుదేశాలలో పేదరికనిర్మూలనకు నిర్దేశిత లక్ష్యాల సాధనకు నగదు బదిలీ పధకాలు అమలు అవుతున్నాయి. షరతులతో కూడిన నగదు బదిలీపధకాలు లాటిన్‌ అమెరికా దేశాలలో మంచి ఫలితాలు సాధించడంతో అందరి దృష్టి వాటిమీద పడింది. 

 

బ్రెజిల్‌లో షరతులతో కూడిన నగదు బదిలీ పధకాలను 2003లో ఏకీకృతం చేసి బోల్సాఫెమిలియా పేరుతో నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రాధమిక విద్యకు కనీసగ్రాంటు, ఆహారభద్రతకు సంబంధించిన నగదు బదిలీ;  వంటగ్యాస్‌కు ఇచ్చే సబ్సీడీలను నగదు బదిలీ చేస్తున్నారు. కుటుంబంలోని  మహిళ యజమానురాలి పేరుమీద ''సిటిజన్‌ కార్డు'' పంపిణీ చేసి బ్యాంకుల ద్వారా నగదు బదిలీ చేస్తున్నారు. దీని ఫలితంగా పోషకాహారలోపం గణనీయంగా తగ్గడం ,బడి బయట పిల్లలు లేకపోవడం, మధ్యంతరంగా  మానేసేవారి సంఖ్య బాగా తగ్గడం, పిల్లలకి వ్యాధినిరోధక టీకాలు పూర్తిస్థాయిలో జరగడం వంటి ఫలితాలు బాగా మెరుగైనట్లు అన్ని దేశాలు అంగీకరిస్తున్నాయి.

 

ఈ నగదు బదిలీ పధకం 1997లో మెక్సికోతో ప్రారంభించారు. ముందుగా  ప్రొగైసా పేరుతో ప్రారంభమై తర్వాత నగదు బదిలీపధకం ''ఆ పర్చు నిడాడెస్‌'' పేరుతో విస్తరించింది. అక్కడ కూడా ఫలితాలు ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించే విధంగా వచ్చాయి. అనేక దేశాలు నగదు బదిలీబాట పట్టాయి. కొలంబియా 2000 సంవత్సరంలో, ఎల్‌సాల్వెడార్‌లో 2005లో, నికరగ్వువాలో 2000లో,  పరాగ్వేలో 2005లో, దక్షిణాఫ్రికాలో 1998లో, ఇలా చాలా దేశాలకు నగదు బదిలీ పధకాలు విస్తరించి అమలులో వున్నాయి.   వివిధ దేశాలలో నగదు బదిలీ పధకాలు సారిస్తున్న ఫలితాల ప్రభావం కూడా నగదు బదిలీల మీద దృష్టిపడడానికి కారణంగా కనిపిస్తున్నది. 

 

నగదు బదిలీ అన్నపేరు వాడకపోయినా ప్రత్యక్షంగా లబ్ధిదారులకు నగదు చెల్లించే పద్ధతి మన దేశానికి, రాష్ట్రాలకి కొత్తకాదు. జీవనభద్రత కోసం సంక్షేమ పధకంగా ఇస్తున్న పెన్షన్‌లు మాతా శిశు సంరక్షణకు ప్రవేశపెట్టిన పలు పధకాలు నగదు బదిలీ పధకాలే. ఒకనాడు నిర్వహించిన ''పనికి ఆహారం'' పధకం  వస్తు బదిలీపధకం అయితే ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పధకం పేరుతో అతిపెద్ద నగదు బదిలీ పధకంగా వుంది. బడుగు బలహీనవర్గాల పిల్లల చదువులకు ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్లు నగదు బదిలీ పధకాలే.

అయితే ఇప్పుడు ప్రభుత్వం ప్రారంభించిన కిరోసిన్‌కు నగదు బదిలీ లేదా గ్యాస్‌ సిలిండర్లు, ఎరువుల సబ్సీడీలకు నగదు బదిలీ పధకాలు కొంత సంక్లిష్టమైనవి. ఈ పధకాలను తగిన జాగ్రత్తలతో రూపొందించకపోతే ఇటు ప్రభుత్వానికి, అటు లబ్ధిదారులకీ ప్రయోజనం కలగని స్థితి వస్తుంది. 

 

ఇప్పుడు కిరోసిన్‌ నగదు బదిలీ అంశాలను మరింత లోతుగా పరిశీలించాలి. పేదలు వంట చేసుకోడానికి, దీపాలు వెలిగించుకోడానికి వీలుగా సబ్సీడీపై కిరోసిన్‌ను ఇస్తున్నారు. కిరోసిన్‌ మీద ఎంతమంది వంట చేసుకుంటున్నారు. దీపాల కోసం ఎంతమందికి కిరోసిన్‌ అవసరం అన్న దానితో నిమిత్తం లేకుండా ప్రతి రేషన్‌కార్డుకీ ఒకే తీరున కిరోసిన్‌ పంపిణీతో ఈ సబ్సీడీ తలబరువైంది. అవసరం లేనివాళ్లు చౌకగా తిరిగి డీలర్‌కే అమ్మడం, పెద్దస్థాయిలో కిరోసిన్‌ బ్లాక్‌ మార్కెట్‌కీ, డీజిల్‌లో కల్తీకి కారణం అవుతున్నది. 

 

మనదేశంలో గ్రామీణప్రాంతంలో కిరోసిన్‌తో  వంట చేసుకునేవారు శాతం 2001లో 2 శాతం వుంటే అది 2008 నాటికి 0.6 శాతానికి పడిపోయింది. పట్టణాలలో అదే కాలంలో 15.3 శాతం నుండి 7.6 శాతానికి తగ్గింది. నిజానికి దేశంలో కిరోసిన్‌ను వంటకంటే దీపాలకే ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కిరోసిన్‌ దీపాలు వాడే వారి సంఖ్య 2002లో 47.2 శాతం  వుంటే, అది 2008కి 38.00 శాతానికి తగ్గింది. అదేకాలంలో పట్టణాలలో 7.8 శాతం నుండి 5 శాతానికి పడిపోయింది. ఆసియా దేశాలలో అతి ఎక్కువ సబ్సీడీతో అతి తక్కువ ధరకి అందిస్తున్న దేశంగా భారతదేశం వుంది. తగ్గుతున్న కిరోసిన్‌ వాడకాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కార్డుదారులందరికీ పంపిణీ చేయడంతో అది పెద్దస్థాయిలో బ్లాక్‌ మార్కెట్‌కి తరలిపోతున్నది. మహారాష్ట్రలో అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ కలెక్టరు యస్వంత్‌సోనావానే హత్య కిరోసిన్‌ మాఫియా చేసిందే. ఇలాంటి హత్యలు ఇప్పటికీ జరుగుతూనే వున్నాయి.  కిరోసిన్‌పై ఇస్తున్న 20,000 కోట్ల సబ్సీడీలో 8000 కోట్లు ఈ మాఫియాలపరం అవుతున్నది. దీనిని డీజిల్‌లో కల్తీ చెయ్యడంతో ఒక పక్క వాయుకాలుష్యం, మరోపక్క ట్రక్కులు, కార్లు రిపేర్ల పాలవుతున్నాయి. అందుచేత అవసరమైన వారికి మాత్రమే కిరోసిన్‌ అందే ఏర్పాటు వుండాలి తప్ప మూకుమ్మడిగా సబ్సీడీ కిరోసిన్‌ పంపిణీ చెయ్యడం మాఫియాలను పెంచిపోషించడం అవుతుంది. 

 

కాని ప్రస్తుతం సబ్సీడీ కిరోసిన్‌కు నగదు బదిలీ పధకాన్ని వర్తింపజేసినా అదనపు కిరోసిన్‌మాత్రం బ్లాక్‌ మార్కెట్‌కు రావడం ఆగిపోదు. అందుచేత నగదు బదిలీ పధకాలు ప్రభుత్వ వ్యయాన్ని దుబారాని తగ్గించేవిగా, లబ్ధిదారులకు నేరుగా సబ్సీడీని  అందించేవిగా వున్నప్పటికీ, అసలు పధకంలోనే లోపాలుంటే పరిస్థితి యధాతధంగానే వుంటుంది. లక్ష్యసాధనకు మార్గాలుగా షరతులతో కూడిన నగదు బదిలీలను అత్యంత లోపరహితంగా రూపొందించినప్పుడే ఇది సత్ఫలితాలను ఇస్తాయి. 


ఇందిరమ్మ బాట ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గట్టెక్కిస్తుందా?

  ఇందిరమ్మబాట ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గట్టెక్కిస్తుందా? 

                                                                                                       - డి.వి.వి.యస్‌. వర్మ

 

ఉప ఎన్నికలలో పరాజయం పాలైన తర్వాత నేరుగా జనంలోకి వెళ్లాలన్న తలంపుతో ఇందిరమ్మ బాటకు ముఖ్యమంత్రి రూపకల్పన చేశారు. తొలివిడతగా తూర్పు గోదావరి జిల్లాలో స్వయంగా  ముఖ్యమంత్రే ఈ కొత్తబాటకు శ్రీకారం  చుట్టారు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్లుగా ఇందిరమ్మ బాట ఫలితాలను విశ్లేషించుకోడానికి తూర్పుగోదావరి పర్యటన సరిపోతుంది. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించి మెరుగైన పాలన అందించేందుకే ఇందిరమ్మబాట ప్రారంభించినట్టు ఆయన ప్రకటించారు. వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడం ఈ బాట ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పధకాలను ప్రభుత్వ పధకాలుగా ప్రజలు భావించకపోవడం వల్లే వారి అభిమానాన్ని ఎన్నికల్లో చూరగొనలేకపోయామని అందుకోసమే ఈ పర్యటనగా ప్రకటించుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా ఏజన్సీలో ముసురుమిల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్ధులతో సంభాషణలు చేశారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. రాత్రి అక్కడే బసచేశారు. నిజానికి ఆశ్రమ పాఠశాలల్లో వసతి గృహాల స్థితి అధ్వాన్నంగా వుంది. టాయిలెట్లు, స్నానాల గదుల స్థితి, నేలమీద పిల్లల పడకల స్థితి, అక్కడ పెట్టే భోజనం నాణ్యత ఎంత దారుణంగా వున్నాయో నిజంగా ముఖ్యమంత్రి తెలుసుకోవాలంటే  ఆయన కూడా అవే టాయిలెెట్లను, స్నానాల గదులను, నేలమీద పడకను స్వయంగా అనుభవించి వుంటే తమ పధకాలు ఎలా వున్నాయో అర్థం అయ్యేవి. అంతేకాని పిల్లలతో ముఖ్యమంత్రి భోజనానికి ప్రత్యేక విందు ఏర్పాట్లు, ఆయన నిద్రించటానికి ప్రత్యేక ఎ.సి. గది ఏర్పాటు చేయించుకుంటే క్షేత్రస్థాయి సమస్యలు ఎలా అనుభవంలోకి వస్తాయి? అలాగే ఉపాధి హామీ కూలీలతో సహపంక్తి భోజనం తంతు సాగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో మహిళా శాసనసభ్యులు వడ్డిస్తుండగా ముఖ్యమంత్రి విందు  ఆరగించారు. అందుకే ముఖ్యమంత్రులు, మంత్రులు ఎన్నిసార్లు పర్యటనలు చేస్తున్నా క్షేత్రస్థాయి వాస్తవాలు స్వానుభవంలోకి రాకుండా పోతున్నట్లు కనిపిస్తున్నది. 

 గతంలో యన్‌.టి.రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఇలాంటి పర్యటనలే చేశారు. ఆయన కోసం ప్రత్యేక వంటకాలు, ఒక ఎ.సి. కుటీరం వగైరాలతో సాగించారు. ఇలాంటి పర్యటనలు నేతల్ని ప్రజలతో మమేకం చెయ్యకపోగా ఇది ఒక ప్రచార తంతుగానే మిగిలిపోతున్నది.  

ఇక రెండోది  ఇందిరమ్మబాట తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోడానికి కాదని ప్రకటించుకున్నా జరిగిన తీరు ఆ ప్రకటనను అపహాస్యం చేసేదిగా సాగింది. ప్రభుత్వ పధకాలన్నీ వై.యస్‌. పేరుమీద సాగినందువల్ల నష్టం జరిగిందని భావించిన సర్కారు ఇప్పటి ప్రచారంలో మళ్లీ అదే బాట పట్టింది. ప్రభుత్వం ముద్రించిన ఇందిరమ్మబాట లోగోలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఫొటో పెట్టడం, 108 వాహనంపై రాజీవ్‌గాంధీ ఫొటోతోపాటు ముఖ్యమంత్రి ఫొటోను ముద్రించడం, రేషన్‌ షాపుల దగ్గర ఇలాంటి పోస్టర్లే దర్శనమిచ్చినట్లు వార్తలొచ్చాయి. ఇది రాజశేఖర రెడ్డి  నడిచినబాటే తప్ప ప్రభుత్వ పధకాలుగా ప్రచారం చేసే రూటు కాదని స్పష్టం అవుతున్నది.

ఇక ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం అంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాటలో కొంత మాట మార్చారు. వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని, పని జరగకపోతే ఒక కార్డుముక్క రాసి పడెయ్యమని సూచించారు. కోనసీమ రైతుల సమస్యలపై ఇలాంటి అనునయం కూడా ప్రదర్శించకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ బాట పేరుతో ముఖ్యమంత్రి ప్రజల దగ్గరకు వెళ్ళారు. సమస్యలు విన్నారు. పరిష్కారాలను వాయిదా వేశారు. సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మిగిలాయి.

ప్రభుత్వ పధకాల అమలు తీరు, వివిధ స్థాయిలలో ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి, మంత్రులకు, శాసన సభ్యులకు తెలియని అంశాలు  కావు. ఎందుకంటే ఈ సమస్యలు హఠాత్తుగా ఈ రోజునే పుట్టుకొచ్చినవి అంతుచిక్కనివి కావు. ప్రభుత్వాలకి ముందుచూపు లేకపోవడం, పరిష్కారమార్గాలు తెలియకపోవడం అసలు సమస్యగా కనిపిస్తున్నది. ఉదాహరణకి ప్రతి సంవత్సరం జూన్‌ నెలలో పాఠశాలలు తెరుస్తారని అందరికీ తెలుసు. సుమారుగా ఎంతమంది పిల్లలున్నదీ తెలుసు అయినా పాఠశాలలు తెరిచేనాటికి పుస్తకాలు వుండవు, యూనిఫాంలు వుండవు. జూన్‌ నెలలో వర్షాలు పడతాయని అందరికీ  తెలుసు. రైతులకు అదే అదను అని తెలుసు. అయినా విత్తనాలు వుండవు. వున్నా అందవు. అందుచేత ఇంత నిర్దిష్టంగా తెలిసిన సమస్యలకే ప్రభుత్వాల దగ్గర పరిష్కారాలు వుండడం లేదంటే అది పాలనలోని అసమర్ధతకి అద్దం పడుతున్నది.

బాటలు ఎన్నికల్లో గట్టెక్కిస్తాయా?

 
రాష్ట్రంలో గత 15-16 సంవత్సరాలుగా అందరు ముఖ్యమంత్రులు తలోబాట చేపట్టిన వారే, యన్‌.టి.ఆర్‌. ముఖ్యమంత్రిగా ప్రజల వద్దకు పాలన పేరుతో తనదైన బాటను ప్రారంభించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా జన్మభూమితో సహా పలు బాటలు ఎడతెరిపి లేకుండా నిర్వహించారు. రాజశేఖర్‌ రెడ్డి రచ్చబండలు, పల్లెబాటలు సాగించారు. ఇప్పుడు కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇందిరబాట పట్టారు. ఈ బాటలన్నీ ప్రజల కోసం చేపట్టినట్టు, ఎక్కడి సమస్యలకు అక్కడ పరిష్కారం కోసం ఉద్దేశించినట్లు ప్రకటించినవే. కాని ఈ బాటల వెనక వున్న లక్ష్యం వేరు. ప్రజల దృష్టిలో తామే సమస్యలు పరిష్కరించే హీరోలు కావాలని, అది తమ నాయకత్వాన్ని స్థిరపరుస్తుందని, తమ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తుందనీ వీరందరి విశ్వాసంగా కనిపిస్తుంది. అయితే ప్రజలకు కావాల్సింది బాటలు కాదు. వారికి చేతలు కావాలి. వారికి ఎక్కడి సమస్యలు అక్కడ తక్షణం పరిష్కారం కావడం ముఖ్యం. అందుకే ఏడాదికోసారి ప్రభుత్వాలు చేసే ఈ బాటల కోసం నిరీక్షించి వీరి రాకకోసం ఎదురుచూడరు. అయినా ఆశ చావక ఇలాంటి బాటలు వచ్చినప్పుడు ప్రజలు వినతి పత్రాలు ఇస్తూనే వుంటారు. వాగ్దానాలే తప్ప పరిష్కారాలు కావడం లేదని ప్రజలకు తెలుసు. 
 

సుపరిపాలనా సూత్రాలు :

 
 ఎందరు ముఖ్యమంత్రులు మారుతున్నా, ఎన్ని బాటలు నిర్వహిస్తున్నా, అందరూ సుపరిపాలనా సూత్రాలను విస్మరిస్తూ వచ్చారు. అందుకే సమస్యలు పేరుకుపోతున్నాయి. ప్రజలలో పాలనపట్ల తీవ్రమైన అసంతృప్తి పెచ్చరిల్లుతున్నది.

మొదటిది: ప్రతిబాటలోనూ ప్రజలు లక్షలాదిగా వినతి పత్రాలు సమర్పిస్తున్నారంటే ప్రభుత్వ పాలనాయంత్రాంగం పనిచేయడంలేదని అర్థం. దాని అసమర్థతకు, అవినీతికి ఇది దర్పణం.  పరిపాలనలో జవాబుదారీతనం పూర్తిగా లోపించినట్లు లెక్క. దీనికి కేవలం పాలనాయంత్రాంగాన్ని నిందించి ప్రయోజనం లేదు. ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకోడానికి వీలుగా బాధ్యతల్ని, అధికారాలని నిర్దిష్టంగా వారికి దఖలు పర్చకపోవడం ప్రధాన కారణం. అందుకే సమస్యల్ని పైపైకి తోసెయ్యడం తప్ప ఎక్కడికక్కడ పరిష్కరించడం వారికి తప్పనిసరి బాధ్యత కావడం లేదు. అందుచేతనే జిల్లాలో కలెక్టరు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చుట్టూ సమస్యలన్నీ తిరుగుతున్నాయి.  

రెండోది : ప్రజలు నివసించేచోట బలమైన, సాధికారత గల స్థానిక ప్రభుత్వాలు లేకపోవడం పంచాయితీలను, మున్సిపాలిటీలను గత 20 ఏళ్లుగా అన్ని ప్రభుత్వాలు ఉత్సవ విగ్రహాలుగా మిగిల్చాయి. వాటికి అధికారాలు, నిధులు, సిబ్బందిని బదలాయించకుండా జీవచ్చవాలను చేశాయి. ప్రజలకు మంచినీరు, స్థానిక రోడ్లు, ఇళ్లు, మరుగుదొడ్లు, రేషన్‌కార్డులు, ఇతర సంక్షేమ పథకాల అమలు, పాఠశాల విద్య, ప్రాథమిక ఆరోగ్య సేవలు వంటి దైనందిన అవసరాలను అవి తీర్చగల స్థితిలో లేకుండా చేశారు. ప్రజల దరఖాస్తులలో అత్యధికం వీటికి సంబంధించినవే. స్థానికంగానే  నిర్ణయాధికారం వుంటే ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారాలు తక్షణం లభిస్తాయి.

ఇక చివరిదీ : ముఖ్యమైనదీ గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో యం.ఎల్‌.ఎ.ల రాజ్యం నడుస్తున్నది. ముఖ్యమంత్రులు వీరి గొంతెమ్మ కోర్కెలను తీర్చకుండా పాలించలేని అస్థిర పరిస్థితి వల్ల వారికి నియోజకవర్గాలను ధారాదత్తం చేస్తూ వచ్చారు. స్థానిక పోలీసు స్టేషన్‌ తహశీల్‌ కార్యాలయం, మండల పరిషత్‌ ఆఫీసుల యంత్రాంగం వివిధ పథకాలన్నింటినీ శాసనసభ్యుల గుప్పెట్లో పెట్టారు. వారి అనుమతి లేకుండా, మంజూరు లేకుండా ఏ చిన్న పనీ జరగని స్థితి నెలకొంది దీంతో పరిపాలన పూర్తిగా భ్రష్టుపట్టింది.

ఈ పరిస్థితిని చక్కదిద్దడమే తక్షణ కర్తవ్యం కావాలి. సుపరిపాలనా సూత్రాలను విస్మరిస్తే పరిస్థితిలో ఎలాంటి మార్పు వుండదు. అందుకే ఎందరు ముఖ్యమంత్రులు ఎన్ని బాటలు పట్టినా ప్రజలు వారిని ఇంటిదారి పట్టిస్తూనే వున్నారు.  
                                                                             ***

కొత్త చిట్కాల సృష్టి - కొర వడిన విధానాల దృష్టి

      కొత్త చిట్కాల సృష్టి - కొర వడిన విధానాల దృష్టి
                          రాష్ట్రంలో రాజకీయ  అంతర్మధనాలు
                                                                                                                        - డి.వి.వి.యస్‌. వర్మ


రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌పార్టీ, ప్రధాన ప్రతి పక్షంగావున్న తెలుగుదేశం పార్టీలు వరుస ఉపఎన్నికలలో పరాజయాలను, కొన్ని చోట్ల డిపాజిట్లు దక్కించుకోలేని పరాభవాలను పొందాయి. ఈ నేపథ్యంలో2014 ఎన్నికల్లో అధికారాన్ని అందిపుచ్చుకోడానికి అంతర్మధనాలు సాగిస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఓటమి తర్వాత ఢిల్లీ యాత్రలు సాగించారు. ఎవరి నివేదికలను వారే చంకన బెట్టుకుని అధిష్టానానికి  అందించారు. ఢిల్లీని మరింత అయోమయం పాలు చేశారు. ఇదే అదనుగా ముఖ్యమంత్రిని, పి.సి.సి అధ్యక్షుణ్ణి మార్చాలంటూ ప్రకటనలు గుప్పించారు. ఈ పదవులకు రకరకాల పేర్లను, ఊహాగానాలను ప్రచారంలో పెట్టారు. అధిష్టానం స్పందన భిన్నంగా వుండడంతో మేధోమధనాల మీద, కార్యకర్తల అసంతృప్తిమీద, కొత్త పథకాల వ్యూహరచన మీద చర్చను ప్రారంభించారు. ముఖ్యమంత్రి  తరపున మంత్రివర్గ ఉపసంఘం అంతర్మధనాన్ని సాగిస్తున్నది. వారు సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తూ 2014 ఎన్నికలలో గెలుపు చిట్కాలను రూపొందిస్తున్నారు. ప్రధాన ప్రతి పక్షంగావున్నా తెలుగు దేశం పార్టీలో అంతర్మధనం పూర్తి కావడానికి ముందు పార్టీలో యువనాయకత్వం చర్చను లేవనెత్తారు. ఇంతవరకు తెర వెనుక వున్న లోకేష్‌ను తెలుగు యువత నేతగా, వారసుడిగా తేవాలనే ప్రకటనలు చేయించారు. అయితే అది కుటుంబ కలహం కాకుండా చూడడానికి పక్కన పెట్టినట్టు కనిపిస్తున్నది. బి.సి. ఓట్లను ఏకమొత్తంగా రాబట్టుకోడానికి తెదేపా ''పెద్దపీట'' చిట్కాకు రూపకల్పన చేసింది. అలాగే రైతులకి, యువతకీ, మహిళాలకీ ''చిన్నపీట'' కసరత్తు జరుగుతున్నట్లు ప్రకటించారు.

ఇప్పటి వరకూ విశ్వసనీయత కోల్పోయిన పార్టీగా తెలుగు దేశం పేరు తెచ్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ దాని సరసన చేరింది. ఈ రెండు పార్టీలకీ ఇది సంక్షోభ కాలం. అయినా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి కొత్త విధానాల మీద, విభిన్నమైన పరిష్కారాలమీద దృష్టి పెట్టడానికి బదులు పాత మూసలో కొత్త చిట్కాల కోసం ప్రయత్నంగా కనిపిస్తున్నది. పాత మూస ఈ పార్టీలకు కొట్టిన పిండి. దానినే మరింత దంచుతున్నారు తప్ప మూస వెలుపల, బాక్స్‌ బయట కొత్త విధానాల కోసం దృష్టి సారించలేక పోతున్నారు.  

కాంగ్రెస్‌ పార్టీ : కాంగ్రెస్‌ మంత్రుల ఉపసంఘం తన చర్చల పరిధిని 5 అంశాలకు పరిమితం చేసినట్లు వార్తలొచ్చాయి. ఇందులో మొదటిది గ్రామపంచాయితీలకు ఎన్నికలు జరపడం. మున్సిపాలిటీలకు, జిల్లా పరిషత్‌లకు, మండలపరిషత్తులకు ఎన్నికలు జరపకుండా గ్రామ పంచాయితీలకే ఎన్నికలు జరపాలని సూచించడం కేవలం రాజకీయ లబ్ధికోసంమేనన్నది సుస్పష్టం. ఎందుకంటే గ్రామ పంచాయితీ ఎన్నికలలో పార్టీల గుర్తులు వుండవు. ఎవరు గెలిచినా గ్రామ అభివృద్ధి పనుల కోసం అధికార పార్టీ వైపు చూడడం సహజం. ఇలా గ్రామస్థాయిలో పట్టు సంపాదించే చిట్కాను మంత్రివర్గ  ఉపసంఘం వెలికి తీసింది. అయితే ఈ ఎన్నికలు అనుకున్నంత త్వరగా జరగే అవకాశం లేదు. రిజర్వేషన్ల సమస్య కోర్టు ముందున్నది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చొరవ తీసుకోలేని స్థితి. ఒకవేళ ఎన్నికలు జరిగినా అది సర్పంచులను ప్రభావితం చేస్తుందే తప్ప ప్రజల్ని ప్రభావితం చెయ్యాలంటే పంచాయితీలకు నిధులు, విధులు, సిబ్బందిని బదలాయింపులు జరగాలి. అలాంటి విధాన పరమైన దృష్టి ఉపసంఘం చర్చలలో మచ్చుకైనా లేదు.

ఇకరెండోది సంక్షేమ పథకాల అమలు వల్ల లబ్ధి ప్రభుత్వానికీ, కాంగ్రెస్‌ పార్టీకి దక్కే విధంగా క్షేత్రస్థాయి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలన్నది. ఇది పార్టీ అనుయాయులకే పథకాల లబ్ధిని పరిమితం చేసి ఇతరులలో మరింత అసంతృప్తిని పెంచేది అవుతుంది. పైగా రాష్ట్రంలో పాలన స్తంభించిన స్థితిలో ఈ చిట్కా మరింత వికటిస్తుంది.

ఇక మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తున్న మిగిలిన మూడు అంశాలు అంటే నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, జిల్లా, పట్టణ, మండల స్థాయిలో పార్టీ కమిటీల ఏర్పాటు, పార్టీ శాసన సభ్యులు లేనిచోట్ల ఇంఛార్జీల నియామాకం వంటివి ఆ పార్టీలో కిందస్థాయి కార్యకర్తలను సంతృప్తి పరిచేవి మాత్రమే. ప్రజల్ని సంతృప్తి పరిచేవి మాత్రం కాదు.

అందుచేత కాంగ్రెస్‌పార్టీ సాగిస్తున్న అంతర్మధనంలో కొత్త విధానాల అన్వేషణగాని, కొత్త పథకాల రూపకల్పనగాని లేవు. రాష్ట్రంలో అవినీతి రహితంగా ప్రజలకు సేవలందించే సమర్ధ పాలనకు మార్గాలు లేవు. కేవలం కార్యకర్తలను సంతృప్తి పరిచే చిట్కాలతో ఇదే తరహా పాలన తంతు సాగిస్తే 2014లో ఫలితాలు ఇంతకంటే దారుణంగా వున్నా ఆశ్చర్యపోనక్కర లేదు.

తెదేపా : తెలుగు దేశం పార్టీ తాను పరిపాలించిన కాలాన్ని ఇప్పటికీ స్వర్ణయుగంగానే భ్రమిస్తున్నది. అదే నిజమైతే 2004లో అది ఓటమి పాలు కాకూడదు. ఒకవేళ ప్రజలు మార్పు కోరారని సరిపెట్టుకున్నా 2009లో నైనా గెలుపు సాధించి వుండాలి. ఇప్పటికీ తెదేపా అదే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ తన ఓటమి కారణాలను లోతుగా పరిశీలించుకోలేక పోతున్నది.  ఆ పార్టీ అంతర్మధనం కూడా పాతమూసలో, చిట్కాల వేటగా సాగింది. 2009లో నిరుపేద కుటుంబాలకు నెలకు 2000 రూపాయలు, ఇతర పేదలకు 1500, 1000 రూపాయలు ఇచ్చే ''నగదు బదిలీ'' పథకం ఎన్నికల్లో గెలుపు కోసం వేసిన చిట్కా. ఇది జరిగే పని కాదులెమ్మని ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుత వాగ్దానాల చిట్టాలలో నగదు బదిలీ, కలర్‌ టీవీలు లేవు. అందుకే తెదేపా నినాదాలకు విశ్వసనీయత లేకుండా పోతున్నది.

ఇప్పుడు ఆ పార్టీ కొత్త పథకాల రచనకు బదులు ప్రభుత్వ పథకాలకు అదనంగా ''కొసరు'' పథకాలు ప్రకటిస్తున్నారు. పెన్షన్‌ సొమ్ములు పెంచడం, 6గంటల విద్యుత్‌ను 9గంటలకు పొడిగించడం, ఉన్నత విద్యలో ఫీజు రీ యింబర్స్‌ మెంటును విస్తృత పర్చడం, రూపాయి బియ్యాన్ని ఉచితం చెయ్యడం వగైరాలన్నీ ఈ ''కొసరు'' పథకాలే. ఇప్పుడు ఆడ పిల్లలకు 25,000 రూపాయల ''పెళ్లికానుక'' పథకం కొత్తదే అయినా రెండేళ్లపాటు ఎంతమంది పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటారో వేచిచూడాల్సిందే.

ఇక గణనీయమైన సంఖ్యలో వున్న బి.సి. ఓటర్లను ఆ కట్టుకోడానికి ప్రకటించిన ''పెద్దపీట''లో తెలుగుదేశం పార్టీ తనకుతానుగా చెయ్యగలిగింది అసెంబ్లీ ఎన్నికలలో 100 సీట్లు వారికి కేటాయించడం. ఇలా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి  చట్టంతో నిమిత్తం లేకుండా ఆ పార్టీ ముందుకు రావడం మంచి పరిణామం.

ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చెయ్యగలిగినవి బి.సి.లలో వివిధ కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు, నామినేటెడ్‌ పోస్టులలో రిజర్వేషన్లు, బడ్జెట్‌లో 10 వేల కోట్లతో ఉపప్రణాళిక తీసుకురావడం. ఉపప్రణాళిక అన్న కొత్త పేరు తప్పిస్తే ఇప్పటికే వివిధ రూపాలలో బి.సి.సంక్షేమానికి దాదాపుగా ఈ మొత్తం ఖర్చు అవుతున్నది. ఇది తప్ప మిగిలినవన్నీ పదవుల చుట్టూ ఉన్న రాజకీయం తప్ప బి.సి. ఓటర్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం కల్పించే అంశాలు కొరవడ్డాయి. ఇది శాసనసభలో ప్రవేశించాలనుకునే వారి రాజకీయ ఆకాంక్షను తీరుస్తుందే తప్ప సాధారణ ఓటర్ల జీవితాలను ప్రభావితం చేసేది అవుతుందా? అన్నది ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.

అలాగే తాము చట్టసభలలో బి.సి.లకు 33శాతం రిజర్వేషన్ల కోసం పోరాడతామని ప్రకటించడం ఆ పార్టీ చేయగలిగిందే. కాని తాము అధికారంలోకి వస్తే స్థానిక ప్రభుత్వాలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, విద్య ఉద్యోగాలలో 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం బి.సి.లను ప్రలోభపెట్టే నినాదం తప్ప ఆ పార్టీ తనంతట తానుగా నెరవేర్చగలిగేది కాదు. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ రెండు అంశాలపైనా 50శాతం రిజర్వేషన్లు దాట కూడదన్న లక్ష్మణ రేఖ గీసింది. ఇక పోతే రాజ్యాంగ సవరణకు పోరాటం చెయ్యడం తప్ప వారికి మరో మార్గం లేదు. ఇలాంటి వాగ్దానాల వల్ల ఆ పార్టీ విశ్వసనీయత పెరగకపోగా తరిగే ప్రమాదం వుంది. మొత్తం మీద తెదేపా బి.సి.లకు చేేస్తున్న వాగ్దానాలు వారిలో రాజకీయంగా ఎదగాలన్న ఆకాంక్షను తృప్తి పరిచేదే తప్ప బి.సి.లలో పేదరికాన్ని తొలగించేవి, మంచి ప్రమాణాల విద్యనీ, వైద్యసేవల్ని, ఉపాధి అవకాశాల్ని ప్రత్యక్షంగా ఆ తరగతులకు అందించే అంశాలు అందులో లేవు. అందుచేత ''కొసరు'' పథకాలతో, నేతలకు పదవీ పందేరాల చుట్టూ రూపొందిన నినాదాలు ఆ పార్టీకి విశ్వసనీయతని, 2014నూ ఓట్ల వర్షాన్ని కురిపిస్తాయా అన్నది ప్రశ్నే.

వై.కా.పా : రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 6న వై.కా.పా విస్తృత సమావేశం జరుపుకున్నారు. తమది ప్రజలపక్షంగా ప్రకటించుకుని, నిరంతరం ప్రజలలోవుంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలను నెమరువెయ్యడం, జగన్‌ జైలు నుండి త్వరలోనే వస్తారన్న భరోసా ఇవ్వడం మీదే విజయమ్మ ప్రసంగం నడిచింది. ఎందుకంటే ఈ రెండింటి మీదే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి వుంది.

ఇటీవల ఉప ఎన్నికలలో వై.కా.పా మంచి విజయాలను సాధించింది. ప్రజల సానుభూతిని, విశ్వాసాన్ని పొందగలిగింది. జగన్‌ జైలు పాలుకావడం, అవినీతి కుంభకోణాలు వెలుగు చూడడం ఆ పార్టీ దిగువ నాయకత్వాన్ని అయోమయంలో పడేశాయి. ఇంతటి విజయాల తర్వాత ఆ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతాయని చేసిన ఊహలు నిజం కాలేదు. ఈ పార్టీని అభిమానించే ఓటర్లు వున్నా నిలబెట్టుకోగల నాయకత్వమే లోటు. ఉన్నవాళ్లు రాజశేఖర రెడ్డి పథకాలు వల్లి వేయడం తప్ప జనం తలరాతలు మార్చే ప్రత్యేక విధానాలు వారికి లేవు.
మొత్తం మీద ప్రధాన సంప్రదాయ పార్టీలన్నీ 2014 ఎన్నికలకు సంసిద్ధమౌతున్నాయి. కొత్త విధానాలతో ప్రజల విశ్వాసాన్ని పొందాలన్న ప్రయత్నం చెయ్యకుండా పాత మూసలో కొత్త చిట్కాల సృష్టితో గట్టెక్కే కసరత్తుగానే రాజకీయ అంతర్మధనాలు సాగిస్తున్నాయి.






 

 స్థాయీ సంఘాలతో  చట్టసభలకు కొత్త సామర్ధ్యం

                                                                                                                             - డి.వి.వి.యస్‌. వర్మ



ఆంధ్రప్రదేశ్‌లో చట్టసభలకు స్థాయీసంఘాలు రాబోతున్నాయి. శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ , శాసనమండలి ఛైర్మన్‌ డా|| చక్రపాణిల అధ్యక్షతన జరిగిన ఉభయసభల రూల్స్‌ కమిటీల సంయుక్త సమావేశం ఆ మేరకు నిబంధనలను సవరించాలని నిర్ణయించింది. ఒకపక్క ప్రభుత్వం, మరోపక్క ప్రతిపక్ష పార్టీలు స్థాయీసంఘాల ఏర్పాటుకు అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శాసనసభ స్పీకర్‌ ప్రకటించారు.

పార్లమెంటులో స్థాయీ సంఘాల తరహాలో ఇవి వుంటాయని, కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే అమలులో వున్న ఇలాంటి కమిటీల వ్యవస్థను అధ్యయనం చేసి మెరుగైన విధి విధానాలతో రాష్ట్రంలో ఈ స్థాయీ సంఘాలను ఏర్పాటు చేస్తామని స్పీకర్‌ ప్రకటించారు.

గత రెండు దశాబ్దాలుగా నానాటికి తీసికట్టు అన్నట్టుగా శాసనసభ సమావేశాల రోజులు క్రమేణా తగ్గిపోతూ వచ్చాయి. లోతైన చర్చలు మృగ్యం అయ్యాయి. సభా కార్యకలాపాలను స్తంభించడం మీదే ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతుంటే ప్రభుత్వం  పక్షం దానికి దోహదం చేసే రీతిలో ప్రతిస్పందిస్తున్నది. ఎవరు అధికారంలో వున్నా సభ జరుగుతున్న తీరు మాత్రం మారడం లేదు. రోజుకో గందరగోళం, పతాక శీర్షికల కోసం రగడలు, రచ్చలు, టెలివిజన్‌ ప్రసారాలలో హీరోలను తలపించేలా కనిపించాలనే తాపత్రయంతో సభ జరగకపోగా ప్రజాధనం దుర్వినియోగం కావడం నిత్యకృత్యం అయింది. చివరికి బడ్జెట్‌ సమావేశాలలో కూడా అత్యధిక పద్దులపై చర్చలు లేకుండానే పలుశాఖల డిమాండ్ల ఉరికొయ్యలకెక్కుతున్నాయి. ఇక  బిల్లుల పైనా, విధానపరమైన అంశాలపైనా చర్చలు లేకుండా ''మమ'' అనిపిస్తున్నారు. అందువల్లనే చట్టసభల మీద ప్రజల విశ్వాసం నానాటికీ సన్నగిల్లుతున్నది.  ప్రజల అధికార పీఠం ప్రజా సమస్యలపై చర్చించే వేదిక కాకపోగా వాకౌట్లకు, వాగ్యుద్ధాలకు వేదిక కావడం చూపరులకు జుగుప్స కలిగిస్తున్నది.

శాసనసభ పనితీరు పై స్పీకర్‌ పలు సందర్భాలలో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఆయన అంతటితో సరిపెట్టుకోకుండా శాసనసభ్యుల భాగస్వామ్యాన్ని పెంచడానికి దోహదం చేసే స్థాయీ సంఘాల ఏర్పాటుకు చొరవతీసుకున్నారు. అటు ప్రభుత్వాన్ని, ఇటు రాజకీయ పార్టీలను ఒప్పించడంలో కృతకృత్యులయారు. వచ్చే శీతాకాల సమావేశాల నాటికి ఈ స్థాయీ సంఘాల ఏర్పాటుకు రంగాన్ని  సిద్ధం చేశారు. ఈ స్థాయీ సంఘాల ఏర్పాటు కాగానే శాసనసభ పనితీరు, సభ్యుల ప్రవర్తన రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యాలు తొలగిపోతాయని  ఎవరైనా భావించడం అత్యాశే అవుతుంది.  ఎందుకంటే వీరంతా దానికే అలవాటు పడ్డారు. ఆ  మూసలో నుండి బైటపడడం అంత తేలిక కాదు. కాని స్థాయీ సంఘాలు అలాంటి మార్పుకు దోహదం చేస్తాయనడంలో  ఆ దిశగా అడుగులు పడేలా చేస్తాయనడంలో ఎలాంటి సందేహానికీ తావులేదు. ఎందుకంటే ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రాలలో ఇలాంటి స్థాయీసంఘాలు విస్తరించడం, అవి సత్ఫలితాలను ఇస్తుండడం స్పష్టంగా కనిపిస్తున్నది.

రాష్ట్ర శాసన సభ చరిత్రలో స్థాయీ సంఘాల ఏర్పాటు ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అయినా మన ప్రింటు ఎలక్ట్రానిక్‌ మీడియాలు ఇంతటి ప్రాధాన్యత గల అంశాన్ని కేవలం  ఒక వార్తగా  ప్రకటించి ఊరుకున్నాయి. అనునిత్యం శాసనసభ  సమావేశాలకి ముందు సంఘర్షణ వాతావరణాన్ని సృష్టించే రాతలు రాయడం, అలాంటి చర్చలను  ప్రసారాలు చెయ్యడం, సభ సజావుగా సాగితే చప్పగా సాగినట్టు వ్యాఖ్యానించడం, సమావేశాల అనంతరం ఎంతకాలం వృధా అయిందీ ఎన్ని కోట్లు ఖర్చు దుబారా అయిందీ వివరించే కధనాలతో ముగింపులు, ముక్తాయింపులతో కాలం గడిపే మీడియా  ఈ సానుకూల పరిణామాన్ని పూర్తిగా విస్మరించడం వాటి స్థితికి అద్దం పడుతుంది.

పార్లమెంటు తరహాలో : చట్టసభలకు స్థాయీ సంఘాలు మన రాష్ట్రానికి కొత్తగాని మన పార్లమెంటుకి, కొన్ని రాష్ట్రాల సభలకి కొత్త కాదు. పార్లమెంటు కార్యకలాపాల నిర్వహణకీ, శాసన సభల నిర్వహణకీ సంబంధించిన వివిధ కమిటీలు చాలా కాలం నుండీ వున్నాయి. పోతే వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్థాయీ సంఘాలను ఏర్పాటు పార్లమెంటు స్థాయిలో 1993లో జరిగింది.  అంటే ఇలాంటి స్థాయీసంఘాలకు దేశంలో దాదాపు రెండు దశాబ్దాల చరిత్ర వుంది. ప్రస్తుతం పార్లమెంటుకు ఈ తరహాస్థాయి సంఘాలు 17 వున్నాయి. వీటిలో ఉభయసభలకీ చెందిన వారు సభ్యులుగా వుంటారు. ఇందులో 6 స్థాయీసంఘాల కార్యకలాపాలకు రాజ్యసభ సెక్రటేరియట్‌, 11 స్థాయిసంఘాల కార్యకలాపాలకు లోక్‌సభ సెక్రటేరియట్‌లు తోడ్పాటునందిస్తాయి. ఉభయసభలకు చెందిన ప్రతి సభ్యుడు ఏదో ఒక స్థాయీ సంఘంలో వుంటారు. అయితే మంత్రులకు మాత్రం ఈ కమిటీలో వుండే వీలు లేదు. ఈ స్థాయీ సంఘాల పదవీకాలం ఒక సంవత్సరం వుంటుంది. అంటే 5 ఏళ్లలో ప్రతి సభ్యుడు 5 స్థాయీసంఘాలలో పనిచెయ్యడానికి అనుభవం గడించడానికి వీలు కలుగుతుంది. ఈ సంఘాలలో గరిష్టంగా 45 మంది సభ్యులుంటారు. ఇందులో 30 మందిని లోక్‌సభస్పీకర్‌, 15 మందిని రాజ్యసభ చైర్మన్‌ నామినేట్‌ చేస్తారు.

ఈ స్థాయీ సంఘాలు తమ పరిధిలోని వివిధ ప్రభుత్వశాఖల బడ్జెట్‌ డిమాండ్లను, ఆ శాఖల వార్షిక నివేదికలను దీర్ఘకాలిక విధాన పత్రాలను అధ్యయనం చేసి తగు సూచనలు సిఫారసులను అందజేస్తాయి. ఈ శాఖలకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లులను పరిశీలిస్తాయి.  అయితే వారీ పాలనా వ్యవహారాలలో తలదూర్చవు. మొత్తం మీద ఈ స్థాయీసంఘాలు వివిధ ప్రభుత్వశాఖల ప్రణాళికలు, విధానాలు, పద్దులు, చట్టాల మీద అధ్యయనానికి, నిఘాకి వేదికలుగా వుంటాయి.

రాష్ట్రాలలో....

 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్థాయిసంఘాలు కేరళ, పశ్చిమ బెంగాల్‌, అస్సాం, తదితర రాష్ట్రాలలో ఏర్పాటై పని చేస్తున్నాయి. ఉదాహరణకి కేరళలోని స్థాయీసంఘాలను తీసుకుంటే వీటికి సభ్యుల్ని స్పీకర్‌ నియమిస్తారు. ఆ సభ్యులలో ఒకరు ఛైైర్మన్‌గా వ్యవహరిస్తారు. పార్లమెంటరీ కమిటీలకు భిన్నంగా ఇక్కడ ఆ శాఖమంత్రి ఈ కమిటీలో ఎక్స్‌అఫీషియా సభ్యులుగా వుంటారు. (ఛైైర్మన్‌గా కాదు) సంబంధిత శాఖ మంత్రి ఇలాంటి కమిటీలకు ఛైర్మన్‌గా వుండకూడదన్నదానిని దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. పోతే సభ్యులుగా వుండాలా? వద్దా? అన్న దానిమీద కొంత చర్చ నడుస్తున్నది. రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ దీనిపై చేసిన వ్యాఖ్యను అందరూ పరిగణనలోకి తీసుకోవాలి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయా శాఖల మంత్రులు కీలకపాత్ర పోషిస్తారు. గనుక ఈ స్థాయీసంఘాలలో ఆయా మంత్రులు సభ్యులుగా వుండడం మంచిదని దానివల్ల వివిధ పక్షాలు చేసే సూచనలు, నిపుణులు ఇచ్చే అభిప్రాయాలు, ఈ నిర్ణయాల వల్ల ప్రభావితులయ్యే ప్రజాసమూహాల అభిప్రాయాలు నేరుగా ఆ శాఖమంత్రి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అందువల్ల ఆ మంత్రిత్వ శాఖ మెరుగైన విధానాలు చేపట్టడానికి వీలు కలుగుతుందని హమీద్‌ అభిప్రాయపడుతున్నారు.

పోతే కేరళలో ఈ స్థాయీ సంఘాలకు ఆయా శాఖల డిమాండ్స్‌, బిల్లుల పరిశీలనతోపాటు, ఆ శాఖకు సంబంధించిన ప్రత్యేక అంశాల మీద అధ్యయనానికి, ప్రభుత్వానికి విధానపరమైన అంశాలమీద సూచనలు, రాష్ట్ర ప్రణాళిక మీద, దాని అమలు మీద సిఫారుసులకు వీలు కల్పించారు.

మొత్తం మీద వివిధ శాఖలకు సంబంధించిన ఈ స్థాయీ సంఘాలు ఇటు పరిపాలనలో జవాబుదారీతనానికి, అటు వివిధ పార్టీల శాసనసభ్యుల భాగస్వామ్యానికి, ఏకాభిప్రాయ సాధనకు దోహదం చేస్తున్నందున దేశవిదేశాలలో ఇలాంటి కమిటీల ఏర్పాటు నానాటికీ పెరుగుతున్నది. వాటి విధివిధానాల పరిధి విస్తరిస్తున్నది. పార్లమెంటు, శాసనసభలలో సభ్యుల సంఖ్య పెద్దది కావడంతో సూక్ష్మఅంశాల చర్చకు చాలా సందర్భాలలో అవకాశం లేకుండా పోతున్నది. పైగా అసలు సమస్య కంటే సభ్యులు తమ పార్టీల విధానాలపరంగానే వాదనలు సాగించడం ప్రధాన లక్ష్యం కావడంతో అర్ధవంతమైన చర్చ, ఏకాభిప్రాయ సాధన మృగ్యం అవుతున్నది.

ఈ సభల కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారాల జరగడం వల్ల సభ్యులు ప్రజల దృష్టిని ఆకర్షించడానికే ప్రాధాన్యత ఇవ్వడం సహజం.

మంత్రులకున్నట్టుగా శాసనసభ్యులకు తగిన సమాచారం అందుబాటులో లేకపోవడం, నిపుణులతో సంప్రదింపులకు, పాలనాయంత్రం ముఖ్యులతో చర్చలకు అవకాశాలు తక్కువ కావడంతో సభ్యుల పరిజ్ఞానం, నాయకత్వ పాత్ర పెరగడం లేదు. పైగా పార్టీల మధ్య ఘర్షణే తప్ప సామరస్యపూర్వక చర్చలకు వీలు కలగడంలేదు.

వీటన్నింటికీ స్థాయీసంఘాలు పరిష్కారంగా కనిపిస్తున్నాయి. వివిధ శాఖల మీద, పద్దులు మీద, బిల్లుల మీద మరింత లోతైన చర్చలకు నిపుణుల సలహాలు పొందడానికి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమస్య ప్రాధాన్యతరీత్య పరిష్కారాలను కనుగొనడానికి ఇవి దోహదం చేస్తాయి. అందువల్ల స్థాయీసంఘాల ఏర్పాటు నిస్సందేహంగా ఒక ఆహ్వానించదగ్గ పరిణామం.





జగన్ విజయ రహస్యం ఏమిటి ???