కొత్త చొరవల పదును లేని కేంద్ర బడ్జెట్‌

             కొత్త చొరవల పదును లేని కేంద్ర బడ్జెట్‌

                                                                                                                     - డి.వి.వి,యస్‌. వర్మ    
                                                                                                                  dvvsvarmablogspot.com
 
కేంద్ర బడ్జెట్‌ మీద ఈసారి దేశంలో కొంత ఆతృత కనిపించింది. 1991లో సరళీకరణ ప్రారంభం అయిన తరవాత రాను రాను బడ్జెట్ల మీద ప్రజల్లో ఆసక్తి తగ్గుతూ వచ్చింది. మొదటిది అంతవరకు ప్రతి బడ్జెట్‌లోనూ ప్రతి వస్తువుమీదా ఎంతోకొంత వడ్డింపులు వుండేవి. ఒకటి అరా రాయితీలు వుండేవి. బడ్జెట్‌ బయట వడ్డింపులు తక్కువగా వుండేవి. ఓటు బ్యాంకు ప్రజాకర్ష పధకాలు తక్కువగానే వుండేవి. ఇప్పుడు బడ్జెట్‌లో పన్నుల పెంపకాలు దాదాపు లేకుండా పోయాయి. వాట్‌తో దాని పని అది చేసుకుపోతున్నది. ఇక జి.యస్‌.టి వస్తే ప్రభుత్వాల పని మరీ తేలికవుతుంది.- ఇక రెండోది ప్రభుత్వ నియంత్రణలో వున్న వాటి ధరలను బడ్జెట్‌ వెలుపల పెంపుదల వుండేది. ఇప్పుడు గ్యాస్‌, ఆయిల్‌, ఫెర్టిలైజర్లు, ఇనుము, సిమ్మెంటు ఒక్కొక్కటి స్వేచ్ఛా మార్కెట్‌లోకి వచ్చేశాయి.  అందువల్ల బడ్జెట్‌ అంటే కేవలం ఆదాయపు రాయితీలకు ఎదురుచూడడం తప్ప అంతా షరా మామూలే కావడంతో ప్రజల్లో ఆసక్తి తగ్గింది.  వ్యాపార-వాణిజ్యవర్గాలు కూడా కొన్ని విధానపరమైన అంశాలకోసం ఎదురుచూడడం తప్ప ఆతృత వుండకుండా పోయింది. ఇదంతా మంచి పరిణామమే.

2013-14 బడ్జెట్‌కు వున్న నేపథ్యం వల్ల దీనిమీద చాలామంది ఆసక్తి చూపించారు. ఒకటి ఆర్థికాభివృద్ధి వేగం మందగించటం, ద్రవ్యోల్బణం ఎంతకీ దిగి రాకపోవడం, ప్రభుత్వం ఎన్నికల ముందు సంవత్సరంలోనే గ్యాస్‌, ఆయిల్‌ ధరలు మార్కెట్‌ ధరలకు దాదాపు దగ్గర చెయ్యడం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం, సబ్సిడీలను క్రమబద్ధం చెయ్యడానికి నగదు బదిలీని ప్రారంభించడంలాంటి చర్యలు తీసుకోవడంతో ఈ బడ్జెట్‌లో అదే దూకుడు వుంటుందని చాలామంది భావించారు. మందగించిన ఆర్థికాభివృద్ధిని తిరిగి పరుగులు తీయించడానికి కీలకరంగాలలో చర్యలు ఉంటాయని భావించారు. రెండోది ఎన్నికలకు  ముందు వున్న బడ్జెట్‌ గనుక జనాకర్షణ పధకాల వెల్లువ వుంటుందని ఊహించారు. ఈ పూర్వరంగంలో బడ్జెట్‌ విశ్లేషణ చేసుకోవడం అవసరం.

2013-14 సంవత్సరానికి 16,65,297 కోట్ల బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ద్రవ్యలోటును 5.2 గానూ, సంవత్సరాంతానికి ద్రవ్యలోటు 4.8 కానున్నట్లు ప్రకటించారు. ముందుగా ద్రవ్యలోటును  అదుపులో వుంచడంలో ఆర్థికమంత్రి కృతకృత్యులయ్యారనే చెప్పాలి. గ్యాస్‌, ఆయిల్‌, నగదు బదిలీలపై తీసుకున్న చర్యలు ఆర్థికమంత్రికి ఈ వెసులుబాటును కల్పించాయనే చెప్పాలి. కేవలం ద్రవ్యలోటు అదుపులో వున్నంత మాత్రాన పరిస్థితి సజావుగా వుందని ఎవరూ భావించకూడదు. మరొకపక్క ద్రవ్యోల్బణం ఇంకా వేధిస్తున్న సమస్యగానే వుండిపోయిందని గుర్తుంచుకోవాలి. 

ఇది ఎన్నికల బడ్జెట్‌

 

ఈ బడ్జెట్‌లో ఎన్నికల దృష్టి స్పష్టంగా కనిపిస్తున్నది. ఆర్థిక మంత్రి చిదంబరం మూడు తరగతులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు     తన ప్రసంగంలోనే ప్రకటించారు. వారికి వాగ్దానాలను ఇచ్చారు.  దేశప్రజలలో మెజారిటీగా వున్న మహిళలు, యువత, పేదలను ఆకర్షించడానికి ఈ బడ్జెట్‌ను ఎక్కు పెట్టారు.  ఇటీవల ఢిల్లీలో జరిగిన అమానుష మానభంగం ఘటన నేపథ్యంలో మహిళల రక్షణకు, సాధికారతకు ''నిర్భయనిధి'' పేరుతో 1000 కోట్లు ప్రకటించారు. అలాగే మహిళలకు ప్రత్యేక బ్యాంకును ప్రతిపాదించారు. ఇది స్వయంసహాయ సంఘ మహిళల అవసరాలను, మహిళా వ్యాపార వాణిజ్యవేత్తల అవసరాలను తీరుస్తుందని ప్రకటించారు.  అలాగే మహిళా శిశు సంక్షేమానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలకు 97,134 కోట్లు కేటాయింపులు చేశారు.

యువతకు నైపుణ్యాల అభివృద్ధికి నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను గతంలోనే ఏర్పాటు చేశారు. 10,00,000 మంది యువతకు ప్రత్యేక శిక్షణ పొందేలా వారిని ప్రోత్సహిస్తామని ఇందులో నైపుణ్యాల ప్రత్యేక పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్‌తోపాటు 10,000 రూపాయలు నజరానాను ప్రకటించారు. ఉద్యోగార్హమైన నైపుణ్యాలను పొందడానికి ఇది ప్రోత్సాహకారి అవుతుందని అన్నారు.

పేద ప్రజల కోసం ప్రారంభించిన నగదు బదిలీ పధకం ''మీ సొమ్ము మీ చేతికి'' అన్న నినాదంతో విస్తరించబోతున్నట్లు వెల్లడించారు. అలాగే అసంఘటిత రంగంలో వున్న రిక్షాడ్రైవర్లు, ఆటోడ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు వంటి వారికి బీమా పథకాన్ని  వర్తింపచేశారు.

మొత్తంమీద రాబోయే ఎన్నికల్లో మహిళల్ని, యువతని, పేదలనీ ఆకర్షించడానికి ఈ బడ్జెట్‌ను చిదంబరం సాధనంగా వినియోగించారు.

ఆర్థికాభివృద్ధికి అరకొర చర్యలు


ఆర్థికాభివృద్ధి రేటు ఒకనాడు 9 శాతానికి చేరింది. ఇప్పుడు 5.4 శాతానికి పడిపోయింది. దీనిని 8 శాతానికి పెంచడం లక్ష్యంగా ఒక సవాలుగా ఆర్థిక మంత్రి వర్ణించారు. కాని  దీనికి తీసుకున్న చర్యలు అంతంతమాత్రంగానే వున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో కొంతమేర రోడ్లకు సంబంధించిన కేటాయింపులు తప్పిస్తే కొత్త చొరవలు అంతగా లేవు. చిన్న పరిశ్రమలకు కొన్ని  రాయితీలు ప్రకటించారు. రెండు పోర్టులను ఏర్పాటు, రెండు మూడు పారిశ్రామిక కారిడార్లు పని ప్రారంభం వంటి కొన్ని చర్యలున్నాయి.

కీలకమైన విద్యుత్‌, బొగ్గు కొరతల సమస్యల్ని పరిష్కరించకపోతే ఈ 5 శాతం వృద్ధిరేటు కూడా నిలబడే అవకాశం లేదు. విద్యుత్‌ కొరత మన ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది.  రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీల సంస్కరణల ప్రస్తావన తప్ప విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చే విధంగా గ్యాస్‌, బొగ్గు అందించే ఏర్పాటుకు తక్షణ చొరవలు  ఈ బడ్జెట్‌లో లేవు. మనదేశంలో విస్తరమైన బొగ్గు నిక్షేపాలున్నా, తవ్వి తీసుకోడానికి తగిన పారదర్శకమైన ఏర్పాట్లు చెయ్యడంలో ప్రభుత్వం ఇప్పటికే విఫలం  అయింది. ఆయిల్‌ దిగుమతులతోపాటు విదేశీమారక ద్రవ్యాన్ని కొల్లగొట్టేదిగా బొగ్గు కూడా తయారైంది. బొగ్గు, గ్యాస్‌ పై విధాన నిర్ణయాలకు వేచి వుంటేది గానే బడ్జెట్‌ ప్రసంగం సాగింది. 

వ్యవసాయరంగానికి 27,049 కోట్లు కేటాయించినా, కీలకమైన వ్యవసాయ మార్కెట్ల విస్తరణకి, స్టోరేజీ సౌకర్యాలకు అదనపు విలువ సమకూర్చే స్థానిక పరిశ్రమలకు, దళారీవ్యవస్థ రద్దుకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. గ్రామ పంచాయతీలలో గోడౌన్‌ల నిర్మాణానికే పరిమితం చేశారు. పామాయిల్‌ దిగుమతి సుంకాలపై రైతు వ్యతిరేక విధానాలను సవరించలేదు. కేవలం బడ్జెట్‌కి సంబంధంలేని బ్యాంక్‌ రుణాలను 5 లక్షల కోట్ల నుండి 7 లక్షల కోట్లకు పెంచారు.

ఇక విద్యారంగానికి కేటాయింపులు పెంచారు. మానవ వనరుల అభివృద్ధి శాఖకు 86,000 కోట్లు కేటాయించారు. కాని విద్యాప్రమాణాల మీద ఎలాంటి దృష్టి పెట్టలేదు. హైస్కూలు విద్యమీద, పాఠశాల విద్య మీద అంతర్జాతీయ, జాతీయ సర్వేల నివేదికలు దయనీయమైన స్థితిలో వున్నా విద్యాస్థాయిని ప్రతి ఏటా  వెల్లడిస్తున్నాయి. అయినా మంచి ప్రమాణాల బోధన, దానికి తగ్గ పరీక్షలు, పాఠశాలల అజమాయిషీ, విద్యా హక్కు చట్టం అమలుకు చర్యలు వంటి అంశాలు విస్మరణకు గురయ్యాయి. అందరికీ విద్య అంటేనే సరిపోదు. అందరికీ  మంచి ప్రమాణాల విద్య, డబ్బుతో,  పుట్టుకతో నిమిత్తం లేకుండా అందించే ఏర్పాట్లు జరగకపోతే సమీకృత అభివృద్ధి అన్న మిధ్యే అవుతుంది. పేదరిక నిర్మూలనకు  వేలకొట్లు ఖర్చు చేస్తున్నా, స్వతంత్ర జీవనానికి, ఎదిగే అవకాశాలకు వీలు కలిగించే విద్యాహక్కు అందించకపోతే పేదరికం శాశ్వతం అవుతుంది. ఎదిగే అవకాశం మృగ్యం అవుతుంది.

అందరికీ ఆరోగ్యం పేరుతో జాతీయ ఆరోగ్యమిషన్‌ కార్యకలాపాలను పట్టణాలకు కూడా విస్త్తరింపచేశారు. ఈసారి వైద్య - ఆరోగ్య రంగాలకు కొంత కేటాయింపులు పెంచారు. ఇక్కడా అదే సమస్య. మంచి ప్రమాణాల వైద్యసేవలు ప్రజలకు అందడం లేదు.  దీనికి ఈ బడ్జెట్‌లో కూడా ఎలాంటి ప్రాధాన్యతా లభించలేదు.

 గ్రామీణాభివృద్ధికి కార్యకలాపాలకు 80,194 కోట్లు కేటాయింపులు చేశారు.  ప్రజలు నివసించే చోట వారికి శుద్ధి చేసిన మంచినీరు ఈగలు, దోమలు లేని పారిశుద్ధ్యం, రోడ్లు, గృహవసతి కల్పనకు వీటిని ఉద్దేశించారు. కాని పంచాయితీలకు, మున్సిపాలిటీలకు అధికారాలు, సిబ్బంది బదిలీ కాకుండా నేరుగా వాటికి నిధులు కేటాయింపులు జరపకుండా ఢిల్లీలో వేస్తే సడక్‌యోజనలు, ఆవాసయోజనలు, శానిటేషన్‌ పధకాలు ఆశించిన ఫలితాలనివ్వవు.

మొత్తంమీద ఈ బడ్జెట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రయత్నంగా కనిపిస్తున్నది. ఆర్థికాభివృద్ధి గురించి కొన్ని ప్రస్తావనలున్నా ఆర్థిక సంస్కరణలు సాహసోపేతమైన నిర్ణయాలకు ఈ బడ్జెట్‌ దూరంగా వుంది. విధానాల ప్రస్తావనే గాని ఆచరణ పదును లేని బడ్జెట్‌గా వుంది.

    మంచి ప్రమాణాల విద్య, ఆరోగ్యసేవలకు ఈ బడ్జెట్‌ భరోసా ఇవ్వలేకపోయింది. ప్రజలు జీవించే చోట్ల మౌలిక వసతుల కల్పనకు భరోసా ఇవ్వలేకపోయింది. విద్యుత్‌, బొగ్గు రంగాల సంక్షోభాల పరిష్కారానికి  దారి చూపలేకపోయింది. ఈ బడ్జెట్‌ గతాన్ని నెమరువేసుకున్నదీ కాదు, వర్తమానాన్ని అర్థం చేసుకున్నదీకాదు. అందుకే భవిష్యత్తు అవసరాలకు తగిన చొరవలు చూపలేకపోయింది.



                                                    ***


2 comments:

Unknown said...

It's an innovative blog that shares the information regarding the Andhra pradesh political news which is highly needed to get awareness on it, Thank you.

Anonymous said...

Spreading awareness is good..Let the people think what they feel about this

http://telengana-or-seemandhra.blogspot.in/2013/08/telengana-or-seemandhra.html