ఆర్ధిక స్వేచ్ఛలో దిగజారిన భారత్‌ స్థానం

              ఆర్ధిక స్వేచ్ఛలో  దిగజారిన భారత్‌ స్థానం 

                                                                                                             - డి.వి.వి.యస్‌. వర్మ
                                                                                                            dvvsvarmablogspot.com          


ప్రపంచ దేశాలలో ఆర్ధిక స్వేచ్ఛ 2012 వార్షిక నివేదిక 2013 జనవరిలో విడుదలైంది. ప్రతి ఏటా హెరిటేజ్‌ ఫౌండేషన్‌ ఈ నివేదికను రూపొందిస్తున్నది. 177 దేశాల పట్టికలో మనది 119వ స్థానం - సాధించిన ర్యాంకు 111. మనదేశం ఈ ర్యాంకులలో అజర్‌బైజాన్‌, బంగ్లాదేశ్‌, ఇరాన్‌, మాలి, నైజీరియా, పాకిస్తాన్‌, సియర్రా లియోన్‌, సిరియా, టాంజానియాల గుంపులో వుంది. బంగ్లాదేశ్‌ 109, నేపాల్‌ 110 స్థానాల్లో వుంటే భారతదేశం, పాకిస్థాన్‌లు 111వ ర్యాంకును పంచుకున్నాయి.  ఘనా, బోట్స్‌వానా, కాంబోడియా, కజాక్‌స్థాన్‌, ఎల్‌సాల్వడోర్‌లు మనకంటే 40 స్థానాలకు ముందున్నాయి. అయితే ఇథియోపియా, అంగోలా, మయన్మార్‌, బురుండి దేశాలు మనకంటే కొంత దిగువన వుండి  మనకి ఊరట కలిగిస్తున్నాయి.

మొదటి ఐదు స్థానాలను హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌, న్యూజిలాండ్‌ స్విట్జర్‌లాంట్‌, అస్ట్రేలియా, కెనడాలు పొందాయి. ఈ చివరి రెండు దేశాలు ఒకే స్థాయిలో 5వ రాంకు పొందాయి.

ఈ ఆర్థిక స్వేచ్ఛ ర్యాంకులకు దేశాల అభివృద్ధికి మధ్య ఒక సంబంధం వుంది. అదీ మనం గమనించాల్సిన విషయం. సామాజిక రాజకీయ, ఆర్ధికపరమైన ఉన్నతికీ, మెరుగైన వ్యక్తిగత జీవనానికీ ఈ ఆర్ధిక స్వేచ్ఛకీ మధ్య విడదీయరాని అనుబంధం వుంది. ఆర్ధికస్వేచ్ఛ హెచ్చుగా వున్న దేశాలు అది లేని దేశాల కంటే మంచి జీవనంలో  ఉచ్ఛస్థితి లో వుంటున్నాయి.                                     

మొదటి ర్యాంకులు పొందిన నాలుగోవంతు దేశాల సరాసరి స్థూల జాతీయోత్పత్తి చివరి ర్యాంకులు సాధించిన నాలుగోవంతు దేశాల కంటే దాదాపు 7 రెట్లు అధికంగా వుంది.

అలాగే ఈ మొదటి స్థానాల దేశాలలో అత్యంత పేదల సంపాదన చివరి స్థానాలు పొందిన దేశాల కంటే 10 రెట్లు ఎక్కువగా వుంది. అలాగే మొదటి దేశాలలో సగటు జీవితకాలం 79.5 సంవత్సరాలుంటే చివరి స్థానాల దేశాలలో 61.6 శాతం మాత్రమే వుంది. అలాగే రాజకీయ స్వేచ్ఛ, పౌరహక్కుల స్థితిలో కూడా చాలా వ్యత్యాసం వుంది.

మొత్తంమీద రెండు దశాబ్దాలుగా సాగిన ఈ అధ్యయనాలు ఎక్కడ ఆర్ధిక స్వేచ్ఛ ఎక్కువగా వుంటే అక్కడ ఆర్ధిక వ్యవస్థలో పెట్టుబడుల రేటు హెచ్చుగా, ఆర్ధిక ప్రగతి రేటు హెచ్చుగా వుందని స్పష్టం చేస్తున్నాయి. పెరుగుతున్న ఆదాయాలు, తరుగుతున్న పేదరికం కనిపిస్తున్నది. అలాగే ఆర్ధిక స్వేచ్ఛ వున్న దేశాలలో ఆర్ధిక, రాజకీయ, న్యాయవ్యవస్థలు ఆ దేశాల తలసరి ఆదాయాలను పెంచడంలో, ఆర్ధికాభివృద్ధిని సాధించడంలో ముందున్నాయి.

ఆర్థిక స్వేచ్ఛ నివేదిక రూపొందించడానికి 5 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వాటి ఆధారంగా అభివృద్ధి పట్టికను రూపొందించారు. 1) ప్రభుత్వ వ్యయాల సైజు 2) న్యాయ వ్యవస్థ, ఆస్థిహక్కుకు గల భద్రత 3) నికర డబ్బు    4) అంతర్జాతీయ వాణిజ్యానికి గల స్వేచ్ఛ  5) చట్టాలు. ఈ ఐదు అంశాలలో 24 భాగాలుంటాయి.  అందులో మరిన్ని   ఉప భాగాలుంటాయి.  మొత్తంమీద 42 అంశాలు ఈ పట్టికకు ప్రాతిపదికగా వుంటాయి. అలాగే ప్రతి అంశాన్ని 0-10 స్కేలు మీద వాటి  స్థితిని గుర్తించి అంతిమ పట్టికను రూపొందిస్తారు.

అందుచేత సాధ్యమైనంత శాస్త్రీయ ప్రమాణాలతో ఈ నివేదికలు రూపొందిస్తున్నారని భావించాలి. అలాగే దీనికి అవసరమైన గణాంక వివరాలను ఆయా దేశాల నుండి కాకుండా అంతర్జాతీయ సంస్థల నుండి సేకరించారు. వీటి ఆధారంగా వచ్చిన పాయింట్లు ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. హంగ్‌కాంగ్‌ 89.3 పాయింట్లతో అగ్రస్థానంలో వుండగా 88.0 పాయింట్లతో సింగపూర్‌ ద్వితీయ స్థానంలోనూ తర్వాత అస్ట్రేలియా, న్యూజిలాండ్‌, స్విట్జర్లాండ్‌లు ఉన్నాయి.

భారతదేశంలో 55.2 పాయింట్లతో 119వ స్థానంలో వుండి 111వ ర్యాంకును మాత్రమే పొందింది. గత సంవత్సరంతో పోల్చినపుడు 0.6 పాయింట్లు పెరిగాయి. ఈ  పెరుగుదల పబ్లిక్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ మరియు మోనిటరీ స్వేచ్ఛల మెరుగుదల వల్ల సాధ్యమైంది. అయితే ఇక్కడ సాధించిన పాయింట్లను దేశంలో పెరిగిన అవినీతి కబళించింది. దీనికి తోడు వ్యవస్థాగతమైన లోటుపాట్లు దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది. సమర్ధవంతంగా పనిచేసే న్యాయ, చట్ట వ్యవస్థల లోటు, ఆర్ధిక వ్యవస్థ అంతటా వ్యాపించిన అవినీతి వల్ల క్రియాశీలకంగా వ్యవహరించే ప్రయివేటురంగం మందగమనంలో పడింది. అనేక రంగాలలో ప్రభుత్వ ఆధిపత్యం, దుబారాతో కూడిన సబ్సిడీ వ్యవస్థలతో బడ్జెట్‌లోటు పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది.

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఆటుపోట్లుతో సాగుతున్నాయి. కీలకమైన సేవారంగాల సరళీకరణ ఆగిపోయింది. అయితే కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2012లో ఎఫ్‌డిఐలను ప్రోత్సహించడం ప్రభుత్వ సబ్సీడీలను తగ్గించడం ప్రారంభమైంది.  మొత్తంమీద ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన ఐదు రంగాలలోని 10 విభాగాలలో 1) ఆస్థి హక్కులకు సంబంధించిన స్వేచ్ఛకు 50.00 పాయింట్లు రాగా 2) అవినీతి నుండి స్వేచ్ఛకు అత్యల్పంగా 31.0 పాయింట్లు 3) ప్రభుత్వ వ్యయంలో ప్రమాణాలకు 77.9 పాయింట్లు  4) ద్రవ్యస్వేచ్ఛకు 78.3 పాయింట్లు 5) వ్యాపారస్వేచ్ఛకు 37.3 పాయింట్లు 6) కార్మిక స్వేచ్ఛకు 73.6 పాయింట్లు 7) మోనిటరీ స్వేచ్ఛకు 65.3 పాయింట్లు 8) వాణిజ్య స్వేచ్ఛకు 63.6  9) పెట్టుబడుల స్వేచ్ఛకు 35.0  10) ఫైనాన్షియల్‌ స్వేచ్ఛకు 40.0 పాయింట్లు పొందినట్లు ప్రకటించింది.

మొత్తంమీద భారతదేశంలో చట్టబద్ధపాలన ఒకే తీరున లేదు. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని వ్యవస్థీకృతం చెయ్యడంలో బలహీనతలున్నాయి. న్యాయప్రక్రియ దీర్ఘకాలం తీసుకునేదిగాను, వ్యయంతో కూడుకున్నదిగాను, రాజకీయ ఒత్తిళ్లకు గురయ్యేదిగానూ వుంది. ఆస్థిహక్కుకు సమర్ధవంతమైన భద్రత కల్పించకపోవడం, మేధోహక్కుల పరిరక్షణలో చాలా లోట్లు వున్నాయి. అలాగే అవినీతి ఆరోపణల విచారణకు   ఉద్దేశించిన స్వతంత్ర ప్రతిపత్తి గల అంబుడ్స్‌మన్‌ ఏర్పాటుకు పార్లమెంటు ఆమోదం లభించలేదని పేర్కొంది.

ప్రభుత్వ ఆదాయ వ్యయాల మీద అంచనా వేస్తూ మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో 7.4 శాతం మాత్రమే ఆదాయ పన్నుగా వుంది. ప్రభుత్వ ఖర్చు మాత్రం 27.1 శాతం కావడంతో బడ్జెట్‌ లోటు తప్పడం లేదు.  జి.డి.పి.లో 67.1 శాతం అప్పులభారం వుందని పేర్కొంది.

అలాగే దేశంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి, ఉత్పత్తి సాగించడానికి వ్యయప్రయాసలతో కూడిన పద్ధతులున్నాయి. ఒక వ్యాపారం ప్రారంభించామంటే  సగటున కనీసం 25 రోజులు పడుతుంది. లైసెన్సు పొందడానికి చాలా ఖర్చు వుంటుంది.

అభివృద్ధి చెందని శ్రామిక మార్కెట్‌ వల్ల నిపుణత వుండడం లేదు. ఉపాధిరంగం ప్రధానంగా అసంఘటిత కార్మికులతోనే వుంది. అలాగే ప్రభుత్వం రకరకాల వస్తువుల మీద ధరల నియంత్రణ చేస్తున్నది. ఇవన్నీ  ఆర్థిక స్థిరత్వాన్ని బలహీనం చేస్తున్నాయి.

ఇక వ్యాపారంలో సుంకాలు 8.2 శాతంగా భారంగా వున్నాయి. దీనికితోడు సుంకాలతో నిమిత్తం లేని అడ్డంకులు వున్నాయి. భారతదేశ బ్యూరోక్రసీ కొత్త పెట్టుబడులకు అననుకూల వాతావరణాన్ని కల్పించేదిగా వుంది. తక్కువ ధరలకు ప్రజలకు సరుకులు అందించే బహుళజాతి చిల్లర వర్తకాన్ని అనుమతించడంలో జాప్యం, ప్రభుత్వరంగ సంస్థల ఆధిక్యం వంటివి కొనసాగుతున్నాయని ఈ నివేదిక పేర్కొంది.

మొత్తంమీద ఆర్థిక స్వేచ్ఛకు, అవినీతి నిరోధకానికి తగిన చర్యలు అరకొర కావడం వల్లనే భారతదేశం అభివృద్ధి వేగం మందగించిందనేది దీని సారాంశం.

మన రాష్ట్రాలు : ఆర్ధిక స్వేచ్ఛ

భారతదేశంలో ప్రధానమైన 20 రాష్ట్రాలలో ఆర్ధిక స్వేచ్ఛ స్థితిపై మరో రిపోర్టు విడుదలైంది. 2009-2011 గణాంకాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ఆయా రాష్ట్రాలకు ర్యాంకులను ప్రకటించింది. ఇందులో గుజరాత్‌ రాష్ట్రం మొదటిస్థానాన్ని పొందగా చివరగా బీహార్‌ వుంది. 2005లో 5వ స్థానంలో వున్న గుజరాత్‌ మొదటి స్థానాన్ని అందుకోగా బీహారు స్థానం అక్కడే వుండిపోయింది. అయితే బీహారు తన స్కోరు పాయింట్లను మాత్రం పెంచుకుంది.

జర్మనీకి చెందిన ఫ్రెడరిచ్‌ న్యూమాన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆర్థికవేత్తలు వివేక్‌ డెబ్రాయ్‌, లవీఫ్‌ భండారీలు ఈ రిపోర్టును రూపొందించారు. ప్రపంచదేశాల ఆర్థిక స్వేచ్ఛ కొలమానాలనే వీరు ఉపయోగించారు. స్వేచ్ఛ మార్కెట్‌ను సమర్ధించే కాంటో ఇన్‌స్టిట్యూట్‌ ఈ నివేదిక రూపకల్పనలో భాగస్వామిగా వుంది.

2005, 2009 సంవత్సరాలలో ఆర్థిక స్వేచ్ఛలో మొదటి స్థానంలో వున్న తమిళనాడు రెండోస్థానం పొందింది. అలాగే 6వ స్థానంలో వున్న మధ్యప్రదేశ్‌ మూడవ స్థానానికి చేరింది.

అలాగే 2005లో 7వ స్థానంలో వున్న ఆంధ్రప్రదేశ్‌ 2009లో 3వ స్థానాన్ని పొందినా 2011 నాటికి 6వ స్థానానికి దిగజారింది. హర్యానా రాష్ట్రం స్థిరంగా 4వ స్థానాన్ని 2005 నుండీ నిలబెట్టుకుంది.

ప్రపంచంలో భారతదేశం స్థానం దిగజారుతున్న రాష్ట్రాలలో పనితీరు అంతకంటే మెరుగుగా కనిపిస్తున్నది.

ఒకనాడు ఆర్థిక వ్యవస్థకు పవర్‌హౌస్‌గా వున్న పంజాబు ఇప్పుడు 12వ స్థానానికి పడిపోయింది. దీనికి ద్రవ్యలోటు, విచ్చలవిడిగా, జనాకర్షణ పధకాలు కారణంగా కనిపిస్తున్నాయి. మొత్తంమీద వివిధ రాష్ట్రాలలో అవినీతి పెరుగుదల, ప్రభుత్వాల వ్యయం,  న్యాయం, చట్టపరమైన అంశాల అమలు, వ్యాపార వాణిజ్య స్వేచ్ఛలను అంచనా కట్టడానికి ఈ నివేదికలు ఉపయోగపడేవిగా వున్నాయి.
 
                                                                                   ***


No comments: