కొత్త చిట్కాల సృష్టి - కొర వడిన విధానాల దృష్టి

      కొత్త చిట్కాల సృష్టి - కొర వడిన విధానాల దృష్టి
                          రాష్ట్రంలో రాజకీయ  అంతర్మధనాలు
                                                                                                                        - డి.వి.వి.యస్‌. వర్మ


రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌పార్టీ, ప్రధాన ప్రతి పక్షంగావున్న తెలుగుదేశం పార్టీలు వరుస ఉపఎన్నికలలో పరాజయాలను, కొన్ని చోట్ల డిపాజిట్లు దక్కించుకోలేని పరాభవాలను పొందాయి. ఈ నేపథ్యంలో2014 ఎన్నికల్లో అధికారాన్ని అందిపుచ్చుకోడానికి అంతర్మధనాలు సాగిస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఓటమి తర్వాత ఢిల్లీ యాత్రలు సాగించారు. ఎవరి నివేదికలను వారే చంకన బెట్టుకుని అధిష్టానానికి  అందించారు. ఢిల్లీని మరింత అయోమయం పాలు చేశారు. ఇదే అదనుగా ముఖ్యమంత్రిని, పి.సి.సి అధ్యక్షుణ్ణి మార్చాలంటూ ప్రకటనలు గుప్పించారు. ఈ పదవులకు రకరకాల పేర్లను, ఊహాగానాలను ప్రచారంలో పెట్టారు. అధిష్టానం స్పందన భిన్నంగా వుండడంతో మేధోమధనాల మీద, కార్యకర్తల అసంతృప్తిమీద, కొత్త పథకాల వ్యూహరచన మీద చర్చను ప్రారంభించారు. ముఖ్యమంత్రి  తరపున మంత్రివర్గ ఉపసంఘం అంతర్మధనాన్ని సాగిస్తున్నది. వారు సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తూ 2014 ఎన్నికలలో గెలుపు చిట్కాలను రూపొందిస్తున్నారు. ప్రధాన ప్రతి పక్షంగావున్నా తెలుగు దేశం పార్టీలో అంతర్మధనం పూర్తి కావడానికి ముందు పార్టీలో యువనాయకత్వం చర్చను లేవనెత్తారు. ఇంతవరకు తెర వెనుక వున్న లోకేష్‌ను తెలుగు యువత నేతగా, వారసుడిగా తేవాలనే ప్రకటనలు చేయించారు. అయితే అది కుటుంబ కలహం కాకుండా చూడడానికి పక్కన పెట్టినట్టు కనిపిస్తున్నది. బి.సి. ఓట్లను ఏకమొత్తంగా రాబట్టుకోడానికి తెదేపా ''పెద్దపీట'' చిట్కాకు రూపకల్పన చేసింది. అలాగే రైతులకి, యువతకీ, మహిళాలకీ ''చిన్నపీట'' కసరత్తు జరుగుతున్నట్లు ప్రకటించారు.

ఇప్పటి వరకూ విశ్వసనీయత కోల్పోయిన పార్టీగా తెలుగు దేశం పేరు తెచ్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ దాని సరసన చేరింది. ఈ రెండు పార్టీలకీ ఇది సంక్షోభ కాలం. అయినా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి కొత్త విధానాల మీద, విభిన్నమైన పరిష్కారాలమీద దృష్టి పెట్టడానికి బదులు పాత మూసలో కొత్త చిట్కాల కోసం ప్రయత్నంగా కనిపిస్తున్నది. పాత మూస ఈ పార్టీలకు కొట్టిన పిండి. దానినే మరింత దంచుతున్నారు తప్ప మూస వెలుపల, బాక్స్‌ బయట కొత్త విధానాల కోసం దృష్టి సారించలేక పోతున్నారు.  

కాంగ్రెస్‌ పార్టీ : కాంగ్రెస్‌ మంత్రుల ఉపసంఘం తన చర్చల పరిధిని 5 అంశాలకు పరిమితం చేసినట్లు వార్తలొచ్చాయి. ఇందులో మొదటిది గ్రామపంచాయితీలకు ఎన్నికలు జరపడం. మున్సిపాలిటీలకు, జిల్లా పరిషత్‌లకు, మండలపరిషత్తులకు ఎన్నికలు జరపకుండా గ్రామ పంచాయితీలకే ఎన్నికలు జరపాలని సూచించడం కేవలం రాజకీయ లబ్ధికోసంమేనన్నది సుస్పష్టం. ఎందుకంటే గ్రామ పంచాయితీ ఎన్నికలలో పార్టీల గుర్తులు వుండవు. ఎవరు గెలిచినా గ్రామ అభివృద్ధి పనుల కోసం అధికార పార్టీ వైపు చూడడం సహజం. ఇలా గ్రామస్థాయిలో పట్టు సంపాదించే చిట్కాను మంత్రివర్గ  ఉపసంఘం వెలికి తీసింది. అయితే ఈ ఎన్నికలు అనుకున్నంత త్వరగా జరగే అవకాశం లేదు. రిజర్వేషన్ల సమస్య కోర్టు ముందున్నది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చొరవ తీసుకోలేని స్థితి. ఒకవేళ ఎన్నికలు జరిగినా అది సర్పంచులను ప్రభావితం చేస్తుందే తప్ప ప్రజల్ని ప్రభావితం చెయ్యాలంటే పంచాయితీలకు నిధులు, విధులు, సిబ్బందిని బదలాయింపులు జరగాలి. అలాంటి విధాన పరమైన దృష్టి ఉపసంఘం చర్చలలో మచ్చుకైనా లేదు.

ఇకరెండోది సంక్షేమ పథకాల అమలు వల్ల లబ్ధి ప్రభుత్వానికీ, కాంగ్రెస్‌ పార్టీకి దక్కే విధంగా క్షేత్రస్థాయి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలన్నది. ఇది పార్టీ అనుయాయులకే పథకాల లబ్ధిని పరిమితం చేసి ఇతరులలో మరింత అసంతృప్తిని పెంచేది అవుతుంది. పైగా రాష్ట్రంలో పాలన స్తంభించిన స్థితిలో ఈ చిట్కా మరింత వికటిస్తుంది.

ఇక మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తున్న మిగిలిన మూడు అంశాలు అంటే నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, జిల్లా, పట్టణ, మండల స్థాయిలో పార్టీ కమిటీల ఏర్పాటు, పార్టీ శాసన సభ్యులు లేనిచోట్ల ఇంఛార్జీల నియామాకం వంటివి ఆ పార్టీలో కిందస్థాయి కార్యకర్తలను సంతృప్తి పరిచేవి మాత్రమే. ప్రజల్ని సంతృప్తి పరిచేవి మాత్రం కాదు.

అందుచేత కాంగ్రెస్‌పార్టీ సాగిస్తున్న అంతర్మధనంలో కొత్త విధానాల అన్వేషణగాని, కొత్త పథకాల రూపకల్పనగాని లేవు. రాష్ట్రంలో అవినీతి రహితంగా ప్రజలకు సేవలందించే సమర్ధ పాలనకు మార్గాలు లేవు. కేవలం కార్యకర్తలను సంతృప్తి పరిచే చిట్కాలతో ఇదే తరహా పాలన తంతు సాగిస్తే 2014లో ఫలితాలు ఇంతకంటే దారుణంగా వున్నా ఆశ్చర్యపోనక్కర లేదు.

తెదేపా : తెలుగు దేశం పార్టీ తాను పరిపాలించిన కాలాన్ని ఇప్పటికీ స్వర్ణయుగంగానే భ్రమిస్తున్నది. అదే నిజమైతే 2004లో అది ఓటమి పాలు కాకూడదు. ఒకవేళ ప్రజలు మార్పు కోరారని సరిపెట్టుకున్నా 2009లో నైనా గెలుపు సాధించి వుండాలి. ఇప్పటికీ తెదేపా అదే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ తన ఓటమి కారణాలను లోతుగా పరిశీలించుకోలేక పోతున్నది.  ఆ పార్టీ అంతర్మధనం కూడా పాతమూసలో, చిట్కాల వేటగా సాగింది. 2009లో నిరుపేద కుటుంబాలకు నెలకు 2000 రూపాయలు, ఇతర పేదలకు 1500, 1000 రూపాయలు ఇచ్చే ''నగదు బదిలీ'' పథకం ఎన్నికల్లో గెలుపు కోసం వేసిన చిట్కా. ఇది జరిగే పని కాదులెమ్మని ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుత వాగ్దానాల చిట్టాలలో నగదు బదిలీ, కలర్‌ టీవీలు లేవు. అందుకే తెదేపా నినాదాలకు విశ్వసనీయత లేకుండా పోతున్నది.

ఇప్పుడు ఆ పార్టీ కొత్త పథకాల రచనకు బదులు ప్రభుత్వ పథకాలకు అదనంగా ''కొసరు'' పథకాలు ప్రకటిస్తున్నారు. పెన్షన్‌ సొమ్ములు పెంచడం, 6గంటల విద్యుత్‌ను 9గంటలకు పొడిగించడం, ఉన్నత విద్యలో ఫీజు రీ యింబర్స్‌ మెంటును విస్తృత పర్చడం, రూపాయి బియ్యాన్ని ఉచితం చెయ్యడం వగైరాలన్నీ ఈ ''కొసరు'' పథకాలే. ఇప్పుడు ఆడ పిల్లలకు 25,000 రూపాయల ''పెళ్లికానుక'' పథకం కొత్తదే అయినా రెండేళ్లపాటు ఎంతమంది పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటారో వేచిచూడాల్సిందే.

ఇక గణనీయమైన సంఖ్యలో వున్న బి.సి. ఓటర్లను ఆ కట్టుకోడానికి ప్రకటించిన ''పెద్దపీట''లో తెలుగుదేశం పార్టీ తనకుతానుగా చెయ్యగలిగింది అసెంబ్లీ ఎన్నికలలో 100 సీట్లు వారికి కేటాయించడం. ఇలా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి  చట్టంతో నిమిత్తం లేకుండా ఆ పార్టీ ముందుకు రావడం మంచి పరిణామం.

ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చెయ్యగలిగినవి బి.సి.లలో వివిధ కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు, నామినేటెడ్‌ పోస్టులలో రిజర్వేషన్లు, బడ్జెట్‌లో 10 వేల కోట్లతో ఉపప్రణాళిక తీసుకురావడం. ఉపప్రణాళిక అన్న కొత్త పేరు తప్పిస్తే ఇప్పటికే వివిధ రూపాలలో బి.సి.సంక్షేమానికి దాదాపుగా ఈ మొత్తం ఖర్చు అవుతున్నది. ఇది తప్ప మిగిలినవన్నీ పదవుల చుట్టూ ఉన్న రాజకీయం తప్ప బి.సి. ఓటర్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం కల్పించే అంశాలు కొరవడ్డాయి. ఇది శాసనసభలో ప్రవేశించాలనుకునే వారి రాజకీయ ఆకాంక్షను తీరుస్తుందే తప్ప సాధారణ ఓటర్ల జీవితాలను ప్రభావితం చేసేది అవుతుందా? అన్నది ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.

అలాగే తాము చట్టసభలలో బి.సి.లకు 33శాతం రిజర్వేషన్ల కోసం పోరాడతామని ప్రకటించడం ఆ పార్టీ చేయగలిగిందే. కాని తాము అధికారంలోకి వస్తే స్థానిక ప్రభుత్వాలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, విద్య ఉద్యోగాలలో 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం బి.సి.లను ప్రలోభపెట్టే నినాదం తప్ప ఆ పార్టీ తనంతట తానుగా నెరవేర్చగలిగేది కాదు. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ రెండు అంశాలపైనా 50శాతం రిజర్వేషన్లు దాట కూడదన్న లక్ష్మణ రేఖ గీసింది. ఇక పోతే రాజ్యాంగ సవరణకు పోరాటం చెయ్యడం తప్ప వారికి మరో మార్గం లేదు. ఇలాంటి వాగ్దానాల వల్ల ఆ పార్టీ విశ్వసనీయత పెరగకపోగా తరిగే ప్రమాదం వుంది. మొత్తం మీద తెదేపా బి.సి.లకు చేేస్తున్న వాగ్దానాలు వారిలో రాజకీయంగా ఎదగాలన్న ఆకాంక్షను తృప్తి పరిచేదే తప్ప బి.సి.లలో పేదరికాన్ని తొలగించేవి, మంచి ప్రమాణాల విద్యనీ, వైద్యసేవల్ని, ఉపాధి అవకాశాల్ని ప్రత్యక్షంగా ఆ తరగతులకు అందించే అంశాలు అందులో లేవు. అందుచేత ''కొసరు'' పథకాలతో, నేతలకు పదవీ పందేరాల చుట్టూ రూపొందిన నినాదాలు ఆ పార్టీకి విశ్వసనీయతని, 2014నూ ఓట్ల వర్షాన్ని కురిపిస్తాయా అన్నది ప్రశ్నే.

వై.కా.పా : రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 6న వై.కా.పా విస్తృత సమావేశం జరుపుకున్నారు. తమది ప్రజలపక్షంగా ప్రకటించుకుని, నిరంతరం ప్రజలలోవుంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలను నెమరువెయ్యడం, జగన్‌ జైలు నుండి త్వరలోనే వస్తారన్న భరోసా ఇవ్వడం మీదే విజయమ్మ ప్రసంగం నడిచింది. ఎందుకంటే ఈ రెండింటి మీదే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి వుంది.

ఇటీవల ఉప ఎన్నికలలో వై.కా.పా మంచి విజయాలను సాధించింది. ప్రజల సానుభూతిని, విశ్వాసాన్ని పొందగలిగింది. జగన్‌ జైలు పాలుకావడం, అవినీతి కుంభకోణాలు వెలుగు చూడడం ఆ పార్టీ దిగువ నాయకత్వాన్ని అయోమయంలో పడేశాయి. ఇంతటి విజయాల తర్వాత ఆ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతాయని చేసిన ఊహలు నిజం కాలేదు. ఈ పార్టీని అభిమానించే ఓటర్లు వున్నా నిలబెట్టుకోగల నాయకత్వమే లోటు. ఉన్నవాళ్లు రాజశేఖర రెడ్డి పథకాలు వల్లి వేయడం తప్ప జనం తలరాతలు మార్చే ప్రత్యేక విధానాలు వారికి లేవు.
మొత్తం మీద ప్రధాన సంప్రదాయ పార్టీలన్నీ 2014 ఎన్నికలకు సంసిద్ధమౌతున్నాయి. కొత్త విధానాలతో ప్రజల విశ్వాసాన్ని పొందాలన్న ప్రయత్నం చెయ్యకుండా పాత మూసలో కొత్త చిట్కాల సృష్టితో గట్టెక్కే కసరత్తుగానే రాజకీయ అంతర్మధనాలు సాగిస్తున్నాయి.






 

No comments: